దశాబ్దాల పోరాటం.. స్వరాష్ట్రంలో ఆకాంక్షలు ఏమాయే?

దశాబ్దాల పోరాటం.. స్వరాష్ట్రంలో ఆకాంక్షలు ఏమాయే?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దశాబ్దాల పాటు సాగిన  ఆత్మ గౌరవ పోరాటం అస్తిత్వ పోరాటం. ఇది జూన్ 2, 2014న భారతదేశంలోని 29వ రాష్ట్రం ఏర్పాటుతో ముగిసింది. ఈ ఉద్యమ చరిత్ర  ప్రపంచ ఉద్యమాల చరిత్ర లో కీలకమైంది. తెలంగాణ ఉద్యమానికి బీజాలు 1952 లోనే నాటి హైదరాబాద్ స్టేట్ అనే స్వరాష్ట్రం లోనే వలస పాలకులకు వ్యతిరేకంగా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం నడిచింది . 

1956 లో కుట్ర పూరితంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన ఈ ప్రాంతం ఒప్పందాల అమలు లో మోసపూరితంగా వంచన కు గురి అయి ఉద్యోగ ఆర్థిక, సామాజిక అసమానతల కారణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  డిమాండ్ తో 1969 లోనే ప్రారంభ మైంది. ఉద్యమం ఉధృతమై హింస కు దారి తీసి పోలీస్ కాల్పుల లో 369 మంది విద్యార్థులు ప్రజలు చంపబడ్డారు. 

నాటి రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరు కార్చి తెలంగాణకు  మరింత నష్టం చేసే ఆరుసుత్రాలు పథకాన్ని ఒప్పు కొన్నారు. ఉద్యోగ రంగంలో స్థానిక రిజర్వేషన్ పేరుతో రాజ్యాంగ సవరణ చేసి 1975 లో రాష్ట్ర పతి ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. 

ఆనాటి మిగతా ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్, కేశవ్ రావు జాదవ్,  బాపూజీ లాంటి ఎంతో మంది మేధావులు తమ శక్తి మేరకు ఉద్యమం సజీవంగా ఉండేందుకు ఐక్య వేదికలు స్టడీ సెంటర్ ల  రూపంలో పని చేశారు.

1985 లో తెలంగాణ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయడం లేదు అని ఆందోళన చేస్తే ఆనాటి సీఎం ఎన్ టి రామారావు 610 జీవో జారీ చేశాడు. అది కూడా అమలుకు నోచుకోలేదు.1990 దశకంలో నాలాంటి వాళ్ళం ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఫ్రంట్ రూపం లో పని చేశాం.

 ఆనాడు తెలంగాణ ఎట్లా ఉంది అంటే ఎవరైనా తెలంగాణ పేరుతో మీటింగ్ పెడితే నక్సలైట్ గా చూసేది.1996 నుండి జన సభ మహాసభ ఐక్య వేదికల ద్వారా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. 

టీఆర్​ఎస్ ఏర్పాటు

2001 లో ఆనాటి టీపీడీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న కేసీఆర్ విద్యుత్తు ఛార్జిల పెంపుకు వ్యతిరేకంగా నాటి సీఎం చంద్రబాబుకు ఉత్తరం రాసి చార్జీల పెంపు ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతది అని నిరసన తెల్పాడు. 

కేసీఆర్ రూపం లో తెలంగాణ కు ఒక నాయకుడు దొరికాడు అని సంబర పడ్డాం. కేసీఆర్​ ను కొన్ని నెలల పాటు సంప్రదించి ఆయన నాయకత్వంలో తెలంగాణ కోసం 2001 తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీ ఏర్పాటు అయింది. 

ఇంకో వైపు అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు అయినాయి. 2001లోనే నా నాయకత్వంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం,  తెలంగాణ జుర్నలిస్ట్ లు, విద్యావంతుల వేదిక రచయితల వేదిక ధూంధాం కళాకారుల వేదిక ఇట్లా అనేక సంఘాలు ఏర్పాటు అయి విడి విడిగా పోరాటాలు చేశారు. 2006లో దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. 

తెలంగాణ ఏర్పడిన క్రమం..

2009లో సుప్రీం కోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ అని తీర్పు ఇస్తే ఉద్యోగుల జేఏసీ తీవ్ర ఆందోళనకు పిలుపు ఇచ్చిం ది. ఎన్నికలలో ఓటమితో ఉద్యమం విరమణ అంచులో ఉన్న కేసీఆర్ కి సుప్రీం కోర్టు ఫ్రీ జోన్ తీర్పు ఎనలేని బలాన్ని ఇచ్చింది. సిద్దిపేట ఉద్యోగుల ఘర్జన లో ఆమరణదీక్ష చేస్తానని చెప్పి 2009 నవంబర్ 29 నాడు దీక్ష ప్రారంభించి డిసెంబర్ 9న నాటి కేంద్ర మంత్రి చిదంబరం చేసిన తెలంగాణ ఏర్పాటు  ప్రకటనతో ముగిసింది .

డిసెంబర్ 23న మరో ప్రకటన తో కేంద్రం వెనుకడుగు వేసింది. కేంద్రం మోసం పూరిత చర్య కారణంగా కోదండరాం నాయకత్వం లో రాజకీయ జేఏసీ ఏర్పాటు అయింది . టీఆర్​ఎస్ తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఉద్యోగుల సంఘాలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల భాగస్వామ్యంతో అద్భుతమైన పోరాటాలు జరిగాయి. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె, సాగర హరం, సడక్ బంద్, రైలు రోకో లాంటి నిరంతర పోరాటాలు జరిగాయి.

1200 మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారు. చివరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకొని  2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ బిల్లు పెట్టి పాస్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కాంగ్రెస్, బీజేపీల మద్దతుతో పాటు, వివిధ  రాజకీయ పార్టీలు , విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు,  కళాకారులు  మొత్తం సబ్బండ వర్గాల విజయం.

ఉద్యమనేతలను పక్కన పెట్టి.. కుటుంబమే రాజ్యమేలింది

ఉద్యమంలో తనతో నడిచిన నాయకులను దూరం పెట్టి తెలంగాణ వ్యతిరేకులను చేరదీసి పదవులను కట్టబెట్టారు. తన కుటుంబ సభ్యులందిరికి పదవులు కట్టబెట్టి ఉద్యమ కారుల పొట్టకొట్టారు.  అంది వచ్చిన అధికారం అవినీతి డబ్బుతో అహంకారం పెరిగి ప్రజలకు అందుబాటులో ఉండకుండా నయా రాజరికం వ్యవస్థ   నిర్మాణం ప్రారంభించారు. పాలన కాస్త కుటుంబ పాలన అయింది. 

ఎమ్మెల్యేలు రారాజులు అయ్యారు. మంత్రులు బానిసలు అయ్యారు. ప్రజలు ఇచ్చిన అధికారం మరిచి ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు చేసే అలవాటు చేసారు. ప్రజలతో ఏం పని ఓట్లు కొనుక్కుంటే చాలు అనుకున్నారు. నీళ్ళు నిధులు నియామకాలు తెలంగాణ నినాదాన్ని పాతర పెట్టి వేల కోట్ల అవినీతికి అలవాటు పడ్డారు. ఇదేమిటి అని ప్రశ్నించే వాడిని అణగ దొక్కి నారు. అక్రమ కేసులు పెట్టారు. 

ధర్నా చౌక్ ఎత్తేశారు. ఫోన్ ట్యాపింగ్ భయం తో చివరికి నాయకులు, ఉద్యమ కారులు ప్రజలు రెగ్యులర్ ఫోనులు మానేసి వాట్స్ అప్ ఫోన్ లు మాట్లాడు కొన్నారు. తెలంగాణ ఇట్ల ఎందుకు అయింది, దీనికి పరిష్కారం ఏమిటి అనుకుంటుండగా బీఆర్​ఎస్​ పదేండ్ల పాలన గడిచింది.

ప్రజలు కేసీఆర్ ను కసితో దించారు

2023లో ఎన్నికలు వచ్చినాయి. అప్పటివరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది . కేసీఆర్ ను దించాలని అనుకున్నారు. ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు . కొంత కాలం బీజేపీ  ప్రత్యామ్నాయం అనుకున్నారు. వివిధ కారణాలతో ప్రజలకు బీజేపీ పై నమ్మకం కుదరలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అనుకున్నారు.  వాళ్ళ ఆరు గారంటీలను నమ్మారు. 

కసి  తో కేసీఆర్ ను దించారు. పదేండ్ల  కేసీఆర్ పాలనకు చరమగీతం పాడినారు. ధనిక రాష్ట్రం కాస్త ఎనిమిది లక్షల కోట్ల అప్పులతో కాంగ్రెస్ పాలన కొనసాగిస్తున్నది . ఆర్థిక వ్యవస్థ కుదేలు అయింది వాళ్ళు హామీ ఇచ్చిన ఆరు గారంటీ లు అమలు చేయడం లో విఫలం అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడున్నరేండ్లు పాలన కొనసాగి ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆశిద్దాం . ఈ ప్రభుత్వం కూడా విఫలం అయితే ప్రజలు బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఎలాగూ ఉంటది.

ఉద్యమకారులుగా విఫలమైనాం

తెలంగాణ ఏర్పాటు అయి 11 ఎండ్లు అయినా ఇంకా అనేక సవాళ్లు ఎదుర్కుంటుంది. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనేది పాలకులు గుర్తించడం లేదు. ఎన్నికలు వస్తే ఓట్లు కొనుక్కొని గెలుస్తాం అనే నమ్మకం తప్ప ప్రజల ఆకాంక్షలు గుర్తించడం లో రాజకీయ పార్టీలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఉద్యమకారులుగా మనం ప్రజల ఆకాంక్షలు వ్యక్త పర్చడంలో  విఫలం చెందాము. ఈ దశాబ్ద కాలంలో ఏనాడు కూడా ఉద్యమ కారులం ఒక వేదిక పైకి రాలేక పోయాం. 

కనీస సంక్షేమం ఏది?

నా దృష్టి లో తెలంగాణ ప్రజలు పుర్నిర్మాణం అనే పెద్ద పెద్ద కోరికలు ఏమి కోరుకోవడం లేదు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగి పిల్లల స్కూల్ ఫీసులు కట్టలేక దవాఖాన లో లక్షల రూపాయలు కట్టలేక సగటు కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. 

దేశంలో ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉండడానికి ఒక చిన్న ఇల్లు, రైతు పండించిన పంటకు గిట్టు బాటులాంటి పథకాలు ఇస్తే చాలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు వీటిని అమలు చేయలేక పోతున్నాం? రాజకీయ పార్టీలు ఎందుకు తమ మానిఫెస్టోలో ఈ పథకాలు పెట్టలేక పోతున్నాయి? విద్య, వైద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు  పేద ప్రజల సొమ్ము ను దోసుకుంటున్నది ఎవరు?   

లక్ష్యాల కోసం ఒత్తిడి తెద్దాం..

సంక్లిష్టమైన సకల జనుల పోరాటం  ద్వారా ఏర్పడిన తెలంగాణ దాని లక్ష్యాన్ని నెరవేర్చ లేక పోయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఇప్పటికీ  అనే క సవాళ్లను ఎదుర్కుంటుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంగా స్థిరమైన అభివృద్ధి తెలంగాణ, భావి తరాల శ్రేయస్సు  కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించి కున్న ఉద్యమ కారులు అందరూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంగా పాలకుల పై ఒత్తిడి  తెచ్చే ప్రయత్నం చేద్దాం.  అదే అమరులకు మనం సమర్పించే నివాళులు!

కేసీఆర్​ను నమ్మితే ఫక్తు రాజకీయం చేశాడు

రాష్ట్రపతి గజెట్ ద్వారా తెలంగాణ 29 రాష్ట్రంగా ఏర్పడడం వెనువెంటనే ఎన్నికలు జరగడం టీఆర్​ఎస్​ విజయం సాధించి జూన్ రెండు 2014 లో కొత్త రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చకచకా జరిగిపోయింది. 

అప్పటి వరకు నిత్యం పోరాటంలో ఉద్యమ నాయకులు అలిసిపోయి రెస్ట్ మూడ్​లోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినారు.  రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకులు తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ చూసుకుంటాడు అని పక్కకు జరిగారు. ఇదే అదునుగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్​ఎస్​ ‘ఫక్తు రాజకీయ పార్టీ’ గా అవతరించి నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదం లక్ష్యంగా పనిచేయకుండా  తన సొంత అజెండా అమలు చేసింది.

అర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

కేసీఆర్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు అప్పు చేసి కర్చు చేసింది. ఫలితం శూన్యం. దీర్ఘ కాలిక లక్ష్యా లు పక్కకు పెట్టి ఓట్లే లక్ష్యంగా పథకాలు ప్రవేశ పెట్టింది. అప్పులు పెరిగి ఆర్థిక వ్యవస్థ కుదేలు అయింది. తద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేక పోయింది. పేదల కొనుగులు శక్తి పెంచే కార్యాచరణ లేకుండా పోయింది. కాంట్రాక్టర్ ల కోసమే ప్రాజెక్ట్ లు కట్టడం వల్ల రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించారు.  

ఐటీ రంగం, ఔషధాలు, వ్యవసాయం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత  స్థిరంగా ఉన్నప్పటికీ, ఆదాయం కంటే వ్యయాలు పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అస్త వ్యస్తం అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం మిషన్ భగీరథతో సహా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి నప్పటికీ అందులో ఉన్న అనేక లోపాల కారణంగా ఫలితాలు కొంత మంది అనుభవించారు. 

కేంద్ర ప్రభుత్వ సహాయంతో రోడ్లు, వంతెనలు,  ప్రజా రవాణాతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో  రాష్ట్రం ముందున్న ది. ధనిక రాష్ట్రంగా అవతించిన తెలంగాణ  ఇంకా ఎంతో అభివృద్ది పంథాలో నడవాల్సిన తెలంగాణ  పాలకుల స్వార్థ లక్ష్యాల కారణంగా గాడి తప్పింది.


- సీహెచ్​ విఠల్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు,టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు