న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. పారిస్ ఒలింపిక్స్ ప్రిపరేషన్స్ను ముమ్మరం చేసింది. మెగా గేమ్స్లో డెబ్యూ చేసేందుకు అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాను ఎనర్జీ సేవింగ్ మోడ్లో ఉన్నానని తెలిపింది. ‘నిజాయితీగా చెప్పాలంటే నేను త్వరలోనే ఒలింపియన్గా మారబోతున్నాననే భావన ఇంకా తగ్గలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ భయమూ పెరుగుతోంది. ఎల్లప్పుడూ మంచి పెర్ఫామెన్స్ ఇవ్వాలనే దృష్టితోనే ఉన్నాను. నా మెదడును కూడా అలాగే ట్రెయిన్ చేస్తున్నా’ అని 50 కేజీల్లో మెడల్ ఫేవరెట్ అయిన నిఖత్ పేర్కొంది.
2022, 23లో సీనియర్ ప్రపంచ టైటిల్స్ నెగ్గిన ఫామ్ను పారిస్లోనూ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నట్లు ఈ తెలంగాణ బాక్సర్ వెల్లడించింది. ‘ప్రతి పోటీ ఎంతో కొంత భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనపై చాలా మంది భారీ అంచనాలు పెట్టుకుంటారు. అది మనసుపై ప్రభావం చూపిస్తుంది. కాకపోతే కష్టపడి పని చేయడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల కొద్దిగా భారాన్ని తగ్గించుకోవచ్చు.
అందుకే సోషల్ మీడియా, సాధారణ ప్రజల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఎనర్జీ సేవింగ్ మోడ్ కోసం చీట్ డే రోజు స్వీట్స్ తింటూ, షాపింగ్ చేస్తూ, సంగీతం వింటూ, నెట్ఫ్లిక్స్ చూస్తూ హాయిగా గడిపేస్తున్నా. ప్రస్తుతం హీరమండి చూస్తున్నా. చాలా ఆసక్తికరంగా ఉంది’ అని నిఖత్ వివరించింది. టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగాలని బలంగా కోరుకున్నా అది జరగలేదు కాబట్టి పారిస్లో కచ్చితంగా మెడల్ గెలిచేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.