హై కోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు

హై కోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు

ఎల్ఆర్ఎస్ పేరుతో అక్రమంగా తెచ్చిన జీవో తో కేసీఆర్ తన ఉరి తాడును తానే తగిలించుకున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మధిర మండల మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట‌ జరిగిన ధర్నా లో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. కరోన సంక్షోభం లో మోడీ ప్రభుత్వం పేదలను, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొస్తే.. కేసీఆర్ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేసేందుకు ఎల్ఆర్ఎస్ పేరుతో 131 జీవోను తీసుకొచ్చారన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. అక్రమ వెంచర్లు వేసి, మధ్య తరగతి ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తుంటే చోద్యం చూసిన సర్కార్.. రెగ్యులరైజ్ పేరుతో 15 వరకు గడువు విధించి ప్రజలను జలగ లాగా రక్తం త్రాగడానికి రంగం సిద్ధం చేసిందని శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. హై కోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు రాలేదని, ప్రభుత్వం తీరు మారే వరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు. ఇదే అహంకార వైఖరి కొనసాగిస్తే కేసీఆర్ కు పతనం తప్పదన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి తహశీల్దార్ కు మెమోరాండం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప‌లువురు స్థానిక బీజేపీ నేత‌లు పాల్గొన్నారు