
- కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని సైనిక్ పాఠశాలలో చదివిన తెలంగాణ విద్యార్థికి మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానికత వర్తిస్తుందో లేదో వివరణ ఇవ్వాలంటూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు చెందిన తనకు స్థానిక కోటా కింద మెడికల్ అడ్మిషన్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ శశికిరణ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఒకటి నుంచి 8వ తరగతి వరకు శశికిరణ్ ఇక్కడే చదివారని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్కు స్థానికత వర్తింపుపై వివరణ ఇవ్వాలని కాళోజీ యూనివర్సిటీని ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.