
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సిద్దిపేట, వెలుగు: నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆగస్టు మొదటి వారంలో సీఎం ప్రారంభిస్తారని ఆలోపు పనులు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో కలిసి ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతంలో 120 టన్నుల కెపాసిటీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నామని, సిద్దిపేటతో పాటు సమీప జిల్లాల్లోని రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు పెరిగేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని, ఇందుకు ఆయిల్ ఫెడ్ సైతం సహకరిస్తుందన్నారు. ఇంపోర్ట్ డ్యూటీ విషయంలో పామాయిల్ రైతులకు అన్యాయం జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. త్వరలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న దక్షిణా ది రాష్ట్రాలన్నింటితో కలసి ప్రధానిని కలిసి ఈ విషయంపై చర్చించనున్నట్టు తెలిపారు. పామాయిల్ రైతుకు 20 వేల మనిమమ్ గ్యారంటీ ప్రైస్ ఉండాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
పలు అభివృద్ధి పనుల ప్రారంభం
హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు. రూ.82 కోట్లతో 150 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన, రూ. 11.50 కోట్లతో 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎన్ బీఎస్ యూ, ఓపీ బ్లాక్, పోస్ట్ నెటల్ వార్డు, ఫార్మసీ , ల్యాబ్, ప్రసూతి విభాగాలను ప్రారంభించారు. అనంతరం రూ.77.20 కోట్లతో కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రూ. 71.30 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. హుస్నాబాద్ కు 50 సీట్ల మెడికల్ పీజీ సెంటర్ మంజూరు చేస్తున్నట్టు మంత్రి దామోదర ప్రకటించారు.
పామాయిల్ రైతుతో మాటామంతి
కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో పామాయిల్ రైతు వీరెల్లి కొమురరెడ్డితో మంత్రులు మాట్లాడారు. మూడున్నరేళ్లుగా 11 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను సాగు చేస్తున్న రైతుతో మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడి పంటను పరిశీలించారు.
ఆయిల్ పామ్ వేసిన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 15 టన్నుల ఆయిల్ పామ్ గెలలు కటింగ్ చేసి దాదాపు 1.15 లక్షలు ఆర్జించినట్టు, సాగులో ఎలాంటి ఇబ్బందులు లేవని రైతు కొమురారెడ్డి మంత్రులకు వివరించారు. కొత్తగా ఆయిల్ పామ్ వేసే రైతులకు కొమురారెడ్డి మార్గదర్శకుడని మంత్రులు అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అడిషనల్కలెక్టర్ గరిమ అగర్వాల్, డీఏవో రాధిక, డీహెచ్వో సువర్ణ పాల్గొన్నారు.