- హైటెక్స్ వేదికగా రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
- హైటెక్స్లో ఈ నెల 20 నుంచి 22 వరకు, రాజ్భవన్లో 25 నుంచి 27 వరకు నిర్వహణ
- హాజరుకానున్న గవర్నర్, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ- నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ఏ టెక్నో- కల్చరల్ ఫెస్టివల్’ పేరిట సాంకేతిక, సాంస్కృతిక మహోత్సవాన్ని హైదరాబాద్లో నిర్వహించనున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైటెక్స్లో ఈ నెల 20 నుంచి 22 వరకు, రాజ్భవన్లో 25 నుంచి 27 వరకు రెండు విడతలుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 20న సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్లో ‘సంస్కృతుల సంగమం సమృద్ధికి సోపానం’ అనే అంశంతో కార్యక్రమం ప్రారంభం కానున్నది.
ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హాజరుకానున్నారు. మొదటి విడత కార్యక్రమంలో కళా ప్రదర్శనలు, సాహిత్యంపై చర్చలు, ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటుంది. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి, స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు, క్రీడా సంబంధిత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రెండో దశలో నైపుణ్యం, అభివృద్ధి, రాజ్ భవన్ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. వైద్యం, ఆరోగ్య శాస్త్రాలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ, ఐటీఈఎస్ పై ప్యానెల్ చర్చలు జరుగుతాయి. హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రులు, జీనోమ్ వ్యాలీ, టీ-హబ్ ను సందర్శిస్తారు. 27న రాజ్ భవన్లో వేడుకతో ఉత్సవం ముగుస్తుంది.
