- అదనపు కలెక్టర్లు, డీఆర్వోల బదిలీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలువురు అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనాపరమైన కారణాలతో మొత్తం 27 మంది అధికారులకు కొత్త పోస్టింగులు ఇస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ జీవో రిలీజ్ చేశారు. సూర్యాపేట, పెద్దపల్లి, గద్వాల, సంగారెడ్డి జిల్లాలకు కొత్త అదనపు కలెక్టర్లను నియమించగా, మరికొందరు అధికారులను ఐఅండ్సీఏడీ (నీటి పారుదల శాఖ) విభాగాలకు, వివిధ జిల్లాలకు డీఆర్వోలుగా, ఆర్డీవోలుగా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది.
వెయిటింగ్లో ఉన్న వారికి, డిప్యూటేష న్పై హెచ్ఎండీఏ, సివిల్ సప్లైస్ వంటి ఇతర విభాగాల్లో ఉన్న వారికి కూడా ఈ తాజా జాబితాలో స్థానచలనం కల్పిస్తూ ప్రాధాన్యత ఇచ్చారు. బదిలీ అయిన వారిలో కీలక పోస్టింగ్ లను గమనిస్తే.. వెయిటింగ్లో ఉన్న బి.హరిసింగ్ను సూర్యాపేట అదనపు కలెక్టర్గా, సంగారెడ్డి అదనపు కలెక్టర్గా ఉన్న ఆర్.డి. మాధురిని నల్గొండ ఐఅండ్సీఏడీ స్పెషల్ కలెక్టర్గా నియమించారు. హెచ్ఎండీఏ నుంచి డి. రాజ్యలక్ష్మిని పెద్దపల్లి అదనపు కలెక్టర్గా, కామారెడ్డి డీఆర్వోగా ఉన్న మధు మోహన్ను గద్వాల అదనపు కలెక్టర్గా పంపారు. అలాగే రంగారెడ్డి డీఆర్వో టి.ఎల్. సంగీతను సంగారెడ్డి అదనపు కలెక్టర్గా బదిలీ చేశారు. హనుమ నాయక్, సూర్యప్రకాశ్, వెంకటేశ్వర్లు వంటి అధికారులకు వనపర్తి, జనగామ తదితర ప్రాంతాల్లో డీఆర్వోలుగా బాధ్యతలు అప్పగించారు.
