- సెక్యూరిటీకి టీయూ వీసీ తాజా ఆదేశం
- మరో గదిలో కూర్చున్న యాదగిరి
- తనపై నియమించిన విచారణ కమిటీకి ఫైళ్లు ఇవ్వొద్దన్న వైస్ చాన్సలర్
- వేసవి సెలవులు రద్దు చేసిన రవీందర్ గుప్తా
- తెలంగాణ యూనివర్సిటీలో ఆసక్తికరంగా మారిన పరిణామాలు
నిజామాబాద్, వెలుగు: అంతా ఓకే అయ్యిందనుకుంటున్న తరుణంలో టీయూ వర్సిటీ వివాదం మరో మలుపు తిరిగింది. వీసీ రవీందర్ ఓయూకు చెందిన ప్రొఫెసర్ నిర్మలాదేవిని రిజిస్ట్రార్గా నియమించడం, దాన్ని రద్దు చేస్తూ ఈసీ మళ్లీ యాదగిరినే కొనసాగిస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రిజిస్ట్రార్ కుర్చీలో ఎవరూ కూర్చోవడానికి వీల్లేదని, అప్పటిదాకా ఆ రూమ్ తాళం తీయొద్దని వీసీ సోమవారం సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈసీ సభ్యులు విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లగా...మరోవైపు బీజేపీ నాయకులు, వర్సిటీ స్టూడెంట్లు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు.
ఉదయం ఎనిమిదింటికే వచ్చిన వీసీ
ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్ గా అంగీకరించని వీసీ రవీందర్ఈనెల 5వ తేదీ తర్వాత జరిగిన పరిణామాలకు కాస్త తగ్గినట్టు కనబడ్డారు. ఆయన అపాయింట్ చేసిన నిర్మలాదేవి తిరిగి ఓయూలో చేరడంతో కాస్త వెనక్కి తగ్గినట్టే అనిపించారు. సిబ్బంది జీతభత్యాల చెక్కుల డ్రాకు అంగీకరించి చెల్లింపులు ముగిసేదాకా సైలెన్స్గానే ఉన్నారు. 12వ తేదీ నాటి మరో ఈసీ సమావేశానికి వెళ్తానని ప్రకటించారు. ఆయన గైర్హాజర్ కావడంతో మళ్లీ ఏం జరుగుతుందా అన్న అనుమానాలు కలిగాయి. వాటిని నిజం చేస్తూ సోమవారం ఉదయం 8 గంటలకే వర్సిటీకి వచ్చిన వీసీ రిజిస్ట్రార్ఆఫీసు రూమ్తాళం తీయొద్దని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.
చేసింది తీర్మానమే.. ఆర్డర్ ఏది : వీసీ
రిజిస్ట్రార్గా యాదగిరిని నియమించాలని ఈసీ మీటింగ్లో తీర్మానం మాత్రమే చేశారని, నియామక ఆర్డర్ ఇవ్వలేదని వీసీ స్పష్టం చేశారు. ఇప్పటికీ తాను ఆ కుర్చీ ఖాళీగానే ఉన్నట్టు భావిస్తున్నానని చెప్పారు. ఎవరూ అపాయింట్ చేయలేదు కాబట్టి గదిని ఓపెన్ చేయలేదన్నారు. గత నెల 19వ తేదీన ఈసీ మీటింగ్ నిర్ణయాల అమలుపై హైకోర్టు
మధ్యంతర స్టే ఇచ్చినందున యాదగిరి నియామకం చెల్లదన్నారు. ఖాళీగా ఉన్న రిజిస్ట్రార్ బాధ్యతలను టీయూకు చెందిన వ్యక్తికే అప్పగిస్తామన్నారు. అంతకుముందు వర్సిటీకి వచ్చిన యాదగిరి లాక్ ఉన్న రూమ్ కు వెళ్లకుండా మరో రూమ్లో వెళ్లి కూర్చున్నారు.
వర్సిటీ సెలవులు రద్దు
ఈనెల 30వ తేదీ వరకు యూనివర్సిటీకి ప్రకటించిన వేసవి సెలవులను విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రద్దు చేస్తున్నట్టు వీసీ తెలిపారు. ఆయా కోర్సుల సెమిస్టర్పరీక్షలతో పాటు ప్రభుత్వం ప్రకటించిన పోటీ పరీక్షలకు వారు హాజరుకావాల్సి ఉందన్నారు. దీనికోసం ఈ నెల 18వ తేదీ నుంచి వర్సిటీ పనిచేస్తుందన్నారు. దానికి ముందు రోజు సిబ్బందితో మీటింగ్ నిర్వహిస్తామన్నారు. ఎప్పుడో నియమించిన స్టాఫ్ సరిపోవడంలేదని, 74 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన చోట 35 మందే ఉన్నారన్నారు. భిక్కనూర్,సారంగాపూర్లో స్టాఫ్ సమస్య ఎక్కువగా ఉందన్నారు. హాస్టల్లోనూ ఇబ్బందులున్నాయని, పుస్తకాలు కూడా కొనాల్సిఉందన్నారు.
కమిటీ సభ్యులకు రికార్డులివ్వొద్దు
రవీందర్ గుప్తా వీసీగా చార్జి తీసుకున్నాక ఈసీ సభ్యుల ఆమోదం లేకుండా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విచారించడానికి త్రీమెన్ కమిటీని నియమించారు. ఆ కమిటీ సభ్యులు ఆఫీసు రికార్డులు పరిశీలించే వీలులేకుండా వీసీ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. తన ఆమోదం లేకుండా ఎవరికీ ఫైళ్లు చూపొద్దని వర్సిటీలోని శాఖలకు లెటర్ పంపారు.
గవర్నర్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి ఫిర్యాదు
రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం వేసిన విషయాన్ని ఈసీ సభ్యులు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు వర్సిటీలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని బీజేపీ లీడర్ దినేశ్ కులాచారి, వర్సిటీ స్టూడెంట్స్ గజేందర్, సాయికుమార్, లక్ష్మీనారాయణ, డిచ్పల్లి వైస్ ఎంపీపీ శ్యామ్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు గవర్నర్ తమిళి సైని కలిసి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని, అయినా సర్కారు స్పందించడం లేదన్నారు. ఛాన్సలర్ హోదాలో చర్యలు తీసుకోవాలని కోరారు.