
- జోన్-3లో టాప్-3 స్థానాల్లో తెలంగాణ జిల్లాలు
- ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు చోటు
హైదరాబాద్, వెలుగు: వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’ (జేఎస్జేబీ 1.0) అవార్డుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గురువారం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకటించిన జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 ర్యాంకుల్లో సత్తాచాటింది. దేశవ్యాప్తంగా వర్షపునీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ మొదటి స్థానం సాధించగా.. చత్తీస్గఢ్, రాజస్థాన్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.
2024–25లో రాష్ట్రవ్యాప్తంగా 5,20,362 వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టింది. ఈ రంగంలో దేశంలోనే అత్యధిక పనులు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. చెక్డ్యామ్లు, ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్, రూఫ్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్వెల్ రీచార్జ్, సబ్-సర్ఫేస్ డైక్స్, ఫామ్ పాండ్స్, పెర్కోలేషన్ ట్యాంకులు వంటి పనులను విజయవంతంగా పూర్తిచేసింది.
ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు సైతం చేయలేకపోయిన పనులను ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రం పూర్తిచేసింది. ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర, ఉపాధి పనుల్లోనూ నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. దీంతో జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 ర్యాంకింగ్స్లో రాష్ట్రానికి అగ్రస్థానం దక్కింది.
తెలంగాణ జిల్లాల హవా..
దేశవ్యాప్తంగా జేఎస్జేబీ 1.0లో మొత్తం 67 జిల్లాలు ఎంపికకాగా.. దక్షిణ జోన్ (జోన్–3)లో తెలంగాణ జిల్లాల హవా కొనసాగింది. ఇందులో మొదటి మూడు జిల్లాలు రాష్ట్రానికే చెందినవి కావడంతోపాటు మరో ఐదు జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మొదటి మూడు స్థానాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు నిలవగా.. ఒక్కొక్క జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నగదు అవార్డులు దక్కనున్నాయి.
రూ.కోటి అవార్డుకు వరంగల్, నిర్మల్, జనగాం జిల్లాలు ఎంపికయ్యాయి. రూ.25 లక్షల రివార్డు విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలు ఎంపికయ్యాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ త్వరలోనే ఈ అవార్డులను అందించనున్నది. వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ దేశంలో నంబర్ వన్స్థానంలో నిలవడంతోపాటు దేశానికి ఆదర్శంగా నిలవడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.