ఆందోళన విరమించిన సినీ కార్మికులు

ఆందోళన విరమించిన సినీ కార్మికులు

సినీ కార్మికులు వేతనాల పెంపుపై చేపట్టిన ఆందోళనను విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో తమ ఆందోళన విరమించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. రేపటి నుంచి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్లు ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై రెండు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సినీ కార్మిక సంఘాలు.. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపారు. 

ఈ చర్చల్లో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటలపాటు చర్చించారు. సినీ కార్మికుల వేతనాలపై దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కార్మికుల సమస్యలను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని, వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకారం తెలపడంతో శుక్రవారం నుంచి సినిమా షూటింగ్ లు ఎప్పటిలాగే జరుగుతాయని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు.