హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సదరన్ డిస్కమ్ పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఫేజ్–2 బేస్ క్యాపెక్స్ పనుల కోసం రూ.294.32 కోట్ల బడ్జెట్ను ఆమోదిస్తూ సంస్థ సీఎండీ జితేశ్ వి.పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో సంస్థ పరిధిలోని వివిధ ఆపరేషన్ సర్కిళ్లలో చేపట్టే 2,793 పనులకు ఆమోదం లభించింది. ఇదివరకే ఫేజ్-I కింద జూన్ 26 న రూ.362.67 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించింది.
ఈ నిధులతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం చేస్తూనే పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు, కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఫీడర్లు, విద్యుత్ లైన్ల అభివృద్ధి, సబ్స్టేషన్ల ఆధునీకరణ, నెట్వర్క్లోని కీలక అవసరాల పరిష్కారం వంటి పనులు చేపట్టనున్నారు. విభాగాలవారీగా పరిశీలిస్తే ‘‘పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపునకు రూ.92.98 కోట్లు, అదనపు లేదా కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల రూ.66.37 కోట్లు, 11 కేవీ లైన్ల విభజన పనులకు రూ.59.53 కోట్లు, డీటీఆర్ల సామర్థ్య పెంపునకు రూ.29.93 కోట్లు, ఎల్.టి. లైన్ల రీకండక్టరింగ్కు రూ.16.64 కోట్లు, 33/11 కేవీ సబ్స్టేషన్ల ఆధునీకరణకు రూ.11.35 కోట్లు, మోడల్ సోలార్ గ్రామాల అభివృద్ధి పనులకు రూ.5.77 కోట్లు, 11 కేవీ లైన్ల రీకండక్టరింగ్కు రూ.5.94 కోట్లు, 2-వైర్ నుంచి 3-వైర్ లైన్ మార్పిడి పనులకు రూ.1.54 కోట్లు, 33 కేవీ ఫీడర్లు, కొత్త బేలు, వీసీబీల ఏర్పాటు, ఆర్ఎంయూలు, ఎర్తింగ్ మెరుగుదల, డీటీఆర్ల పునర్వ్యవస్థీకరణ పనులకు మిగిలిన నిధుల కేటాయింపు జరిగింది” అని సీఎండీ ప్రకటించారు.
తర్వలోనే సర్కిళ్ల వారిగా పనులు చేపట్టనున్నట్లుగా ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత ఆధునీకరించి, గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సదరన్ డిస్కమ్ కట్టుబడి ఉందన్నారు.
