న్యూఢిల్లీ: అమెరికా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు తొలిసారిగా భారత్కు విచ్చేసిన ఆయన ఢిల్లీకి వచ్చేముందు మీడియాతో మాట్లాడారు. అమెరికా వైఖరిని ప్రతిఘటించడానికి, దేశాలు డాలర్పై పూర్తిగా ఆధారపడడాన్ని తగ్గించడానికి 'బ్రిక్స్ బ్యాంక్' ఎంతగానో దోహదపడుతుందన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పెజెష్కియన్ భేటీ అయ్యారు.
రెండు వారాల వ్యవధిలో ఇరు నేతలు భేటీ కావడం ఇది రెండోసారి. గతంలో ఆగస్ట్ 31న బిష్కెక్లో జరిగిన సమావేశాన్ని గుర్తుచేస్తూ.. యుద్ధాన్ని వీడి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేలా వివిధ దేశాలతో భారత్కు ఉన్న బలమైన దౌత్య సంబంధాలను ఉపయోగించాలని మోదీని పెజెష్కియన్ కోరారు. హార్ముజ్లో పరిస్థితులు, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అంతరాయాలపై ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
