తెలుగు భాషలో న్యాయపాలన జరగాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ అనుకున్న రీతిలో జరగడం లేదు. గతంలో ఎలాంటి అధికారం లేని అధికార భాషాసంఘం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. 2008 అక్టోబర్ 31న తెలుగును భారత ప్రభుత్వం అధికారికంగా శాస్త్రీయ భాషగా ప్రకటించింది. కానీ పాలనా భాషగా కోర్టులో న్యాయపాలన కోసం భాషగా తెలుగు రూపుదిద్దుకోలేదు. అడపాదడపా కొందరు వ్యక్తుల ప్రోద్భలంతో కొన్ని కార్యక్రమాలు జరిగి తెలుగులో తీర్పులు చెప్పడానికి కొంతమంది న్యాయమూర్తులు ఉత్సాహం చూపారు. కానీ, అందులో పెద్ద పురోగతి లేదు. హైకోర్టు కాకుండా జిల్లా కోర్టుల విషయానికి వస్తే సివిల్, క్రిమినల్ కోర్టులలో న్యాయపాలన తెలుగులో జరపవచ్చు. సివిల్ ప్రొసీజర్ కోడ్లో, అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అందుకు తగిన నిబంధనలు ఉన్నాయి.
సివిల్ ప్రొసీజర్ కోడ్లో దిగువ కోర్టుల్లో తెలుగును వాడేవిధంగా వెసులుబాటు కల్పించే నిబంధన సె.137 ఉంది. సివిల్ కోర్టుల్లో సివిల్ కేసుల విచారణ ఏ భాషలో జరగాలి అని నిర్ధారించే అధికారం ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకు సె.137 ప్రకారం ఉంటుంది. హైకోర్టు కోరిక మేరకు సివిల్ కోర్టుల్లో తెలుగు వినియోగం గురించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 1295 తేదీ 16 జులై 1962లోనే జారీ చేసింది. ఆ తరువాత ప్రభుత్వం మరో జీవోని జీవో ఎంఎస్ 829 తేదీ 20–4–1965న జారీచేసి కొన్ని ప్రాంతాలలో ఉర్దూని వాడేవిధంగా వెసులుబాటు కల్పించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898ని సవరించి 1974వ సంవత్సరంలో కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని తీసుకుని వచ్చింది. ఈ చట్టంలోని సె.272 ప్రకారం హైకోర్డు కాకుండా మిగతా క్రిమినల్ కోర్టుల్లో వాడే భాషని నిర్దేశించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది.
క్రిమినల్ కోర్టులలో తెలుగును ఉపయోగించవచ్చు
తేదీ 29 మార్చి 1974న జీవో ఎంఎస్ నం.485ని జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం తెలుగుని అన్ని జిల్లాల్లోని క్రిమినల్ కోర్టులలో తేదీ 1 ఏప్రిల్ 1974 నుంచి ఉపయోగించుకోవచ్చు. నేను ఈ దిశగా తీర్పులు చెప్పి ప్రయత్నం చేసినప్పుడే అది అనుకున్న రీతిలో ఊపందుకోలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అమల్లోకి వచ్చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సె.272 స్థానంలో సె.307 వచ్చేసింది. దాని ప్రకారంగా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు క్రిమినల్ కోర్టుల్లో తెలుగు వినియోగం గురించి మళ్లీ కొత్త జీవోలను జారీచేశాయి. అయినా సివిల్, క్రిమినల్ కోర్టుల్లో తెలుగు వినియోగం జరగడం లేదు. నేను తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు నా స్ఫూర్తితో కొంతమంది తెలుగులో తీర్పులు చెప్పినారు. కానీ క్రమేణా ఆ స్ఫూర్తి తగ్గిపోయినట్టు అనిపిస్తోంది.
నిరాహార దీక్ష
మనం జిల్లా స్థాయిలో తెలుగు వినియోగం జరగడం లేదని మదనపడుతుంటే, తమిళనాడు హైకోర్టులో తమిళ వినియోగం గురించి ప్రజల నుంచి, న్యాయవాదుల నుంచి ఒత్తిడి చాలాకాలంగా కొనసాగుతున్నది. ఫిబ్రవరి 2024లో మద్రాస్ హైకోర్టులో తమిళ వినియోగం గురించి ఓ న్యాయవాది నిరవధిక నిరాహార దీక్ష చేయాలని తలపెట్టాడు. పోలీసు యంత్రాంగం నుంచి ఇబ్బందులు రావడంతో అతను మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి పోలీసుల దగ్గర నుంచి అనుమతి పొందాడు. శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా అతను నిరాహారదీక్ష చేసుకోవడానికి కొన్ని పరిమితులతో మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు కార్యకలాపాలు తమిళంలో జరగాలని బలంగా డిమాండ్ చేయడానికి అతను నిరాహార దీక్ష చేస్తున్నాడని కోర్టు పేర్కొంది. ( జి. భగవంత్ సింగ్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ 9–2–2024).
హైకోర్టులో ప్రాంతీయ భాష వినియోగం
హైకోర్టు, సుప్రీంకోర్టుల విషయానికి వస్తే కోర్టుల్లో వాడే భాషను నిర్ధారించే అధికారం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అవకాశం లేదు. కానీ ఆ కోర్టుల్లో భాషని నిర్ధారించే అధికారం పార్లమెంట్కి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఉపయోగించే భాషను నిర్ధారించే అధికారం పార్లమెంట్కి ఉంది. ఈ అధికరణలోని సబ్క్లాజ్ (1) ప్రకారం సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులలో న్యాయప్రక్రియ తప్పనిసరిగా ఇంగ్లిష్లోనే జరగాలి. ఇందుకు భిన్నంగా న్యాయప్రక్రియ జరగడానికి శాసనాన్ని చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. కానీ ఆ ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదు.
తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానం
తమ భాషపట్ల తమిళులకి మక్కువ ఎక్కువ. ఆ విషయం చాలాసార్లు ప్రస్ఫుటం అవుతూనే ఉంటుంది. సెప్టెంబర్ 3, 2026న మద్రాస్ హైకోర్టు తమిళాన్ని ప్రధాన భాషగా ఉపయోగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది.
అందులోని ముఖ్యాంశాలు..
తమిళనాడు అధికారిక భాషాచట్టం 1956లోని సె.2 ప్రకారం తమిళం ఆ రాష్ట్ర అధికారిక భాష.
ఆ చట్టంలో సె.4ఎ, సె.4బి ప్రకారం తమిళంలో సాక్ష్యాలను నమోదు చేసుకోవచ్చు. తీర్పులను ప్రకటించవచ్చు. హైకోర్టు పరిధిలోని అన్ని
క్రిమినల్ కోర్టులకి, సివిల్ కోర్టులకి, ట్రిబ్యునల్స్కి రెంట్ కంట్రోల్ కోర్టులకి, రెవెన్యూ కోర్టులకి వర్తిస్తుంది.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 (2) ప్రకారం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హైకోర్టు కార్యకలాపాలు రాష్ట్ర అధికార భాషలో జరగడానికి ఈ ఆర్టికల్ అధికారాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని తమిళనాడు అధికార భాషా చట్టంలోని సె.7 కూడా చెబుతున్నది.
- ప్రపంచవ్యాప్తంగా సుమారు 9కోట్ల మంది ప్రజలు, భారతదేశంలో సుమారు 8కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష తమిళం. ఈ భాషకి గొప్ప భాషా సాహిత్య వారసత్వం ఉంది.
- తమిళభాష ప్రాచీనతను, సాహిత్య, సంప్రదాయాలను, శాసనాలను, చారిత్రక ఆధారాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 12 అక్టోబర్ 2004న దాన్ని ప్రాచీన భాషగా గుర్తించని తీర్మానం గుర్తు చేసింది. గతంలో తమిళనాడు శాసన సభ 6 డిసెంబర్ 2006న ఇలాంటి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తీర్మానం పేర్కొంది. ఆ ప్రతిపాదనని భారత ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం కోసం పంపినారని ఈ ప్రతిపాదనని ఫుల్ కోర్టు అంగీకరించలేదు. ఈ విషయాన్ని అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి 2 ఫిబ్రవరి 2018న రాజ్యసభకు తెలిపినట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
- న్యాయభాషలో తమిళం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. అనువాద ప్రక్రియలో, ఈ–కోర్టు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, న్యాయపరమైన డేటాబేస్లో గణనీయ అభివృద్ధిని తమిళం సాధించింది.
- కృత్రిమ మేధస్సు, సాంకేతికతలలో సాధించిన పురోగతిని తీర్మానం హైలైట్ చేసింది. ఇప్పుడు తమిళ ప్రసంగాన్ని ఏకకాలంలో ఆంగ్లంలో వినిపించవచ్చు. వినవచ్చు. తద్వారా బహుభాషా న్యాయప్రక్రియలను సులభతరం చేయవచ్చు.
- మద్రాస్ హైకోర్టులో తమిళభాషని తమిళంగా గుర్తించి అవసరమైన డాక్యుమెంట్లు, వాదనలు తమిళంలో వచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.
- హైకోర్టు తీర్పులు, డిక్రీలు, న్యాయ ఉత్తర్వులు తమిళంలో ఉండేవిధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, కోర్టు సిబ్బందికి న్యాయపరమైన శిక్షణని తమిళంలో అందించాలని తీర్మానం కోరింది.
- మద్రాస్ హైకోర్టులో ప్రధాన భాషగా తమిళం వినియోగాన్ని సులభతరం చేయడానికి తక్షణ చట్టపరమైన పరిపాలనా చర్యలు తీసుకోవాలని తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
హైకోర్టులో తెలుగు వినియోగం కోసం ఉద్యమించాలి
తమిళనాడు శాసన సభ తీసుకున్న ఈ నిర్ణయం మనల్ని కూడా మేల్కొలుపుతున్నది. తెలంగాణ మాతృభాష పరిరక్షణ దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేయాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తున్నది. మనం కూడా హైకోర్టులో తెలుగు వినియోగం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగులో కార్యకలాపాలు జరపవద్దేమో కానీ వాదనలు వినిపించడానికి ఎలాంటి నిషేధం లేదు. కోర్టుల భాష ప్రజల భాష అయినప్పుడే న్యాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు చూపిన చొరవను, మన రాష్ట్ర అసెంబ్లీ
చూపాల్సిన అవసరం ఉంది. చివరగా కాళోజీ మాట. ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు..సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’.
- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్)
ఓపెన్ పేజీopenpage@v6velugu.com
