- స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడం భరత్కాలనీ, ఆకెనపల్లి శివారులో సర్వే నంబర్ 3లోని 2.30 ఎకరాల భూమి స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ఆఫీసర్లను భూ బాధితులు, స్థానికులు, నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రాంకిష్టయ్య అనే వ్యక్తి కుటుంబీకులు 2.30 ఎకరాల భూమి తమదని కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ భూమిలో అనధికారికంగా ప్లాట్లు వేసి అమ్ముకోగా, మరికొందరు ఇండ్లు కట్టుకున్నారు. 13 ఇండ్లు ఉండగా, మిగిలిన స్థలంలో ప్లాట్లు ఉన్నాయి.
13 ఇళ్లను కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. గతంలో యజమానులకు పరిహారం ఇస్తామని బాధితులు తెలపగా, తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత పరిహారం ఇవ్వకపోవడంతో యజమానులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. సాయంత్రం ఇరువర్గాల మధ్య కోర్టు సమీపంలో చర్చలు జరగగా, రూ.కోటి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సర్పంచ్ మౌనిక కనక రాజు, ఉప సర్పంచ్ ముత్తె విజయ -భూమయ్య పాల్గొన్నారు.
