బీఆర్ఎస్ ​ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. యువకులపై చేయి చేసుకున్న సీఐ

బీఆర్ఎస్ ​ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత..  యువకులపై చేయి చేసుకున్న సీఐ

డిచ్​పల్లి, వెలుగు: నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలోని అమృతపురంలో ఆదివారం బీఆర్ఎస్​ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్​ రూరల్​అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ​ప్రచారానికి రాగా, గ్రామానికి చెందిన యువకులు సమస్యలపై ప్రశ్నించేందుకు యత్నించారు. వీరిని బీఆర్ఎస్​ లీడర్లు వారించారు. విషయం తెలుసుకున్న డిచ్​పల్లి సీఐ కృష్ణ వెంటనే అక్కడికి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా ఇద్దరు యువకులపై చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది.  సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన తమపై సీఐ దాడి చేశారని యువకులు వాపోయారు. సీఐ కృష్ణ బీఆర్ఎస్ ​తొత్తుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై సీఐ కృష్ణను వివరణ కోరగా సదరు యువకులు ఉద్దేశపూర్వకంగా పార్టీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. లా అండ్ ​ఆర్డర్ ​సమస్య రావడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే మినిమం ఫోర్స్​ఉపయోగించాల్సి వచ్చిందన్నారు.