రాజధాని ప్రాంతం తుళ్లూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల పాదయాత్రను అడ్డుకోడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. పాదయాత్రగా వెళ్తున్న మహిళలను, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్ వాహనం ముందు మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మహిళలను చదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరోవైపు తుళ్లూరు పీఎస్ లో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. తమని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీలతో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఆందోళనలు 29వ రోజు ఉదృతంగా కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. తుళ్లూరు నుంచి పాదయాత్రగా బయల్దేరిన మహిళలు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రైతులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. పలువురు మహిళలు, రైతులకు గాయాలయ్యాయి. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ఎవరూ బయటకు రావొద్దంటూ మైకుల్లో ప్రకటిస్తున్నారు. రైతులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు.