స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ

రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‍ ఇచ్చి వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఏడాదిన్నరగా సర్పంచ్‍, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులకు..రాబోయే 15 రోజుల్లో తమ గ్రామం, వార్డు, మండలం ఏ సామాజికవర్గానికి రిజర్వ్  అవనుందో తెలియక ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‍ కామారెడ్డి డిక్లరేషన్‍లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే రిజర్వేషన్ల ఇష్యూ కోర్టులో ఉంది. ఈక్రమంలో ప్రభుత్వం మాత్రం రాబోయే నెలలో లోకల్‍ బాడీ ఎన్నికలు ఉంటాయనే మాట చెబుతోంది. స్థానిక ఎన్నికలు మొత్తం బీసీ రిజర్వేషన్ల అమలు, కోర్ట్  నిర్ణయం  చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తరపున మంత్రులు, లీడర్లు బయట ఎక్కడ మాట్లాడొద్దని సీఎం, పీసీసీ చీఫ్‍ చెప్పారు. 

మంగళవారం (జూన్ 17) మంత్రి పొన్నం ప్రభాకర్‍ వరంగల్‍ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో పర్యటించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. తాము రాష్ట్రవ్యాప్తంగా కులగణన చట్టం చేసి గవర్నర్‍ ఆమోదం, ఆపై కేంద్రానికి పంపామని తెలిపారు.  అందువల్లే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆలస్యం అవుతున్నట్లు వెల్లడించారు. దీంతో రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థులు టెన్షన్‍ పడుతుండగా, విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో ఆసక్తిగా గమనిస్తున్నాయి.