
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపడొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు మనోదైర్యాన్ని ఇచ్చి అండగా ఉండాలని తెలిపారు.
విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు త్వరగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని కాబట్టి విద్యార్థులు అందోళన చెందకూడదని మంత్రి సబిత తెలిపారు. మే 09న వెలువడిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు కొందరు ఆత్మహత్యకు పాల్పడటం పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ ఏడాది 86.60శాతం విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ లో లాగే పదో తరగతి ఫలితాల్లో కూడా బాలికలదే హవా నడిచింది. మొత్తం ఈ ఏడాది 4 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు . ఇక బాలికలు 88.53శాతం సాధించారు.
99 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా నిర్మల్ నిలిచింది. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా లాస్ట్ లో ఉంది. 2, 793 స్కూళ్లలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 25స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.