శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో టెర్రర్ ఫండింగ్, రిక్రూట్మెంట్ చేస్తున్న ఓ నకిలీ ఎన్జీవో గుట్టురట్టు చేశారు. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వాళ్లనుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీ మెటీరియల్, 5 పిస్టల్స్, 2 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర కాశ్మీర్కు చెందిన మరో ఐదుగురితో కలిసి పేదలకు ఆర్థిక సాయం పేరుతో ‘ఇస్లాహి ఫలాహి రిలీఫ్ ట్రస్ట్ (ఐఎఫ్ఆర్టీ) పేరుతో ఎన్జీవో నడుపుతున్నట్లు గుర్తించారు. దీని ద్వారా వచ్చే ఫండ్స్ను టెర్రరిస్టులకు చేరవేస్తున్నారని, పేద యువకులను టెర్రర్ సంస్థల్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదేశాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించే వారన్నారు. ఆగస్టు 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బారాముల్లా పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక పోస్టర్లు అంటించింది కూడా ఈ బృందమేనని తెలిపారు.