టెట్ అప్లికేషన్కు ఆగస్టు 16 లాస్ట్

టెట్ అప్లికేషన్కు ఆగస్టు 16 లాస్ట్

రాష్ట్రంలో నిర్వహించబోతున్న  టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అప్లికేషన్ గడువు రేపు(ఆగస్టు 16) సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఈ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే 6 జిల్లాల్లో టెట్ పరీక్షకు సెంటర్లును అధికారులు బ్లాక్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్ జిల్లాల సెంటర్లు అధికారులు బ్లాక్ చేశారు. 

ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి..

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు ఆగస్టు14  సోమవారం సాయంత్రం నాటికి 2,23,811 దరఖాస్తులు వచ్చాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. పేపర్ 1కు 68,062, పేపర్ 2కు 12,815 దరఖాస్తులు రాగా, రెండింటికీ కలిపి 1,42,934 వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో గురుకుల పరీక్షలు నడుస్తుండటంతో అభ్యర్థులు ఎక్కువగా టెట్​పై దృష్టి పెట్టలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో టెట్​కు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి, వారం రోజుల పాటు దరఖాస్తు గడువు పెంచాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రాంమోహన్​ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  

ఆగస్టు 1వ తేదీన టెట్ నోటిఫికేషన్ రిలీజైంది. ఆగస్టు 2వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 16వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15వ తేదీ టెట్ పరీక్ష జరగనుంది. సెప్టెంబర్‌ 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్-2023కు సంబంధించి పేపర్‌-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అర్హత ఉన్నవారు రాయడానికి అర్హులు. అదేవిధంగా బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్‌-2తోపాటు పేపర్‌-1 పరీక్ష కూడా రాసుకునే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివుతున్నవారు కూడా టెట్ రాయడానికి అర్హులే.
 

ముఖ్యమైన తేదీలివే..

టెట్-2023 నోటిఫికేషన్ వెల్లడి: 01.08.2023.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023.

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.08.2023.

హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో:  01.08.2023 - 15.08.2023.

హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 09.09.2023.

టెట్ పరీక్ష తేదీ: 15.09.2023.

పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.

పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.