- ఫైన్తో మే 2 వరకు అప్లైకి చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా టీజీ ఎప్ సెట్కు 2,93,387 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో ఇంజినీరింగ్ విభాగానికి అత్యధికంగా 2,05,353 అప్లికేషన్లు రాగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 87,735 మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాలకు కలిపి 299 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎప్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు శనివారం అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ఫైన్తో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.250 లేట్ ఫీజుతో ఈనెల 10 వరకు, రూ.500 లేట్ ఫీజుతో 15 వరకు, రూ.2,500 లేట్ ఫీజుతో 20 వరకు, రూ.5 వేల లేట్ ఫీజుతో 24 వరకు, రూ.10 వేల లేట్ ఫీజుతో మే 2 వరకు అప్లై చేసుకోవచ్చు.
నేటి నుంచి ఎడిట్ ఆప్షన్..
విద్యార్థులు అప్లై చేసుకున్న దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే సోమవారం నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానున్నదని విజయకుమార్ తెలిపారు. ఈనెల 8 వరకు ఆన్లైన్ అప్లికేషన్ తప్పులు సరిచేసుకోవచ్చని సూచించారు. కాగా, మే 4 నుంచి ఎప్ సెట్ ఆన్ లైన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానుండడంతో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం విద్యార్థులు ఈనెల 23 నుంచి, ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు 27 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
