
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ కమిటీ వేసింది. ఈ కమిటీ చైర్మన్ గా మంత్రి కొండా సురేఖ.. మరో16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్తూ సర్కార్ జీవో విడుదల చేసింది. ఎకో టూరిజం అభివృద్ధి కోసం కమిటీ మూడు సమావేశాల్లో ఆయా టూరిజం స్పాట్స్ ను గుర్తించాలని సూచించింది. ప్రత్యేకమైన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు జారి చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. పర్యావరణానికి, వన్య ప్రాణులకు ఏ మాత్రం హాని కలగకుండా.. ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేస్తామన్నారు. 2024, జూన్ 22వ తేదీ శనివారం సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటి ఛైర్మన్, మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎకో టూరిజం అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సరికొత్తగా ఆవిష్కరించనున్నామన్నారు. రాష్ట్రంలోని 12 సర్క్యూట్ లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. అడ్వెంచర్, రీక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఆర్కియాలజీ శాఖతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ రూపకల్పన పేరుతో కాలయాపన చేసిందని మంత్రి విమర్శించారు కొండా సురేఖ
ఒడిషా, కర్నాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఎకో టూరిజం విధానాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఆ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గమనించిన పరిస్థితులను ఇక్కడి పరిస్థితులతో బేరీజు వేసుకొని అత్యుత్తమ ఎకో టూరిజం పాలసీల రూపకల్పనకు కృషి చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. గతంలో జరిగిన సమావేశంలో ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల, వలస పక్షుల ఆవాసాలు, జీవవైవిధ్య ప్రాంతాలు, వారసత్వ కట్టడాలున్న ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని మంత్రి సురేఖ అధికారులకు గుర్తు చేశారు.