- 100కి పైగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు విజయవంతం
- భవిష్యత్తులో అండర్గ్రౌండ్ కేబుల్స్ అనుసంధానమూ ఈజీ
హైదరాబాద్, వెలుగు: కరెంట్ పోల్పైనే ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసే సరికొత్త విధానాన్ని టీజీ ఎస్పీడీసీఎల్ తీసుకొచ్చింది. 11 మీటర్ల ఎత్తుగల పోల్పై మూడు రకాల ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సంప్రదాయ పద్ధతిలో సిమెంట్తో కట్టిన దిమ్మెల మీద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే కనీసం 30–35 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని, కాంక్రీట్ దిమ్మెల నిర్మాణం, క్యూరింగ్ ప్రక్రియకు సుమారు వారం రోజుల సమయం పడుతుందని సీఎండీ పేర్కొన్నారు.
హెచ్జీ ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, ఏబీ స్విచ్ వంటి విద్యుత్ ఉపకరణాలను ప్రత్యేకంగా మరో పోల్ పై ఏర్పాటు చేయాల్సి రావడం వల్ల పీటీఆర్ దిమ్మె శుభ్రత లోపించి పోల్ చుట్టూ చెత్త పేరుకుపోయే అవకాశం ఉండటంతో పాటు సిబ్బందికి నిర్వహణ పనులు సిబ్బందికి కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్న ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో 377 మిల్లీ మీటర్ల వ్యాసార్థం కలిగిన 11 మీటర్ల గుండ్రటి పోల్పై 6, 9 అడుగుల ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయవచ్చని వెల్లడించారు.
భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న అండర్ గ్రౌండ్ కేబుల్స్ను కూడా ఈ పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లకు ఎంతో సులభంగా అనుసంధానం చేయవచ్చని సీఎండీ వివరించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 304 ప్రాంతాల్లో ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
