హనుమకొండ సిటీ, వెలుగు: టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సేవలను డిజిటల్ గా అందుబాటులోకి తెస్తున్నట్టు సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని కరెంట్ బిల్లుల చెల్లింపు ఆఫీసులో సీఎండీ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్(కియోస్క్)ను ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ సేవలను డిజిటల్ గా మార్పు చేయడం ద్వారా వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
పేమెంట్ చేసే సమయం వృథా కాకుండా యూనియన్ బ్యాంక్ సహకారంతో పారదర్శకంగా ఉండేలా పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టామన్నారు. కియోస్క్ పనితీరు ఈజీగా ఉందన్నారు. వినియోగదారులు యూనిక్ సర్వీస్ నంబర్ ను కియోస్క్ లో నమోదుచేస్తే క్యూఆర్ కోడ్ వస్తుందనిన్నారు. మొబైల్ లోని యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి బిల్లు చెల్లించవచ్చన్నారు. ఇక కౌంటర్ల వద్ద వేచి చూడాల్సిన అవసరం ఉండదన్నారు.
త్వరలో మరిన్ని ఈఆర్వో సెంటరల్లో సర్వీస్ అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ వి.తిరుపతిరెడ్డి, సీజీఎం ఆర్.చరణ్దాస్, సీఈ శ్రవణ్ కుమార్, జీఎంలు శ్రీనివాస్, వెంకటకృష్ణ, హనుమకొండ ఎస్ఈ మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు.
