హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాల అప్డేట్కు గడువును మరోసారి పొడిగించింది. అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించినట్లు కమిషన్ సెక్రటరీ హరిత ప్రకటనలో తెలిపారు. మార్చి 25తో గడువు ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగత వివరాల అప్డేట్తోపాటు, విద్యార్హతల ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులకే భవిష్యత్తులో విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుందని పేర్కొన్నారు.
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే, ఇప్పటికే రిజిస్టర్చేసుకున్న వారు మాత్రం నిర్ణీత గడువులోగా తమ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని వెల్లడించారు. ఒకే అభ్యర్థి పలుమార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా డేటాను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10 లోపు తమ ఓటీఆర్ వివరాలను అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in ద్వారా సరిచేసుకోవాలని సూచించారు.
