
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. దసరా స్పెషల్ సర్వీసుల్లోనే జీవో ప్రకారం ఛార్జీలు సవరించినట్లు తెలిపింది. పండుగల నేపథ్యంలో బస్సు టికెట్ ఛార్జీలను పెంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంపలో ఏమాత్రం వాస్తవం లేదు.. ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరించినట్లు తెలిపింది.
స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ ఛార్జీలో 50 శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ చెబుతోంది. 2003 నుంచి ఈ సిస్టమ్ నే ఆనవాయితీగా వస్తోందని, ఇప్పుడు స్పెషల్ బస్సుల్లో కొత్తగా ఛార్జీలను సవరణ చేస్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు చెప్పింది.
ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది పర్వదినాల సమయంలో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసి తెలిపింది.
ఇలాంటి సమయాల్లో ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసి యాజమాన్ని నడుపుతున్నారు. రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో బస్సులు ఖాళీగా వెళ్తుంటాయని తెలిపింది.
ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50 శాతం వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది.
టీజీఎస్ ఆర్టీసలలో ప్రస్తుతం 10వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 నుంచి వెయ్యి స్సెషల్ బస్సులను మాత్రమే సంస్థ నడుపుతుందన్నారు. ఆ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం ఛార్జీల సవరణ ఉంటుంది.