MGBSకు ఎవరూ రాకండి.. MGBS నుంచి బయల్దేరాల్సిన బస్సులు.. ఎక్కడెక్కడ నుంచి నడుస్తున్నాయంటే..

MGBSకు ఎవరూ రాకండి.. MGBS నుంచి బయల్దేరాల్సిన బస్సులు.. ఎక్కడెక్కడ నుంచి నడుస్తున్నాయంటే..

హైదరాబాద్: మూసీ న‌దికి భారీ వ‌ర‌ద వస్తున్న క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు కీలక సూచన చేసింది. ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. MGBS బస్టాండ్ జల దిగ్భంధంలో కూరుకుపోవడంతో ప్రత్యామ్నయంగా ఎంబీజీఎస్ నుంచి బ‌య‌లుదేరే బ‌స్సుల‌ను హైద‌రాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ న‌డుపుతోంది. 

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే స‌ర్వీసులు జేబీఎస్ నుంచి న‌డుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట‌, న‌ల్లగొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి న‌డుస్తున్నాయి.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌ర్నూలు, బెంగ‌ళూరు వైపున‌కు వెళ్లే స‌ర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి. మూసీ వ‌ర‌ద‌ నీరు చేరిన క్రమంలో.. ఎంజీబీఎస్కు ప్రయాణికులు ఎవ‌రూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. ఎంబీజీఎస్ నుంచి న‌డిచే బ‌స్సుల‌ను ఇత‌ర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామ‌ని, ఆయా మార్గాల ద్వారా త‌మ గమ్య స్థానాల‌కు చేరుకోవాల‌ని ఆర్టీసీ సూచించింది. వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని తెలిపింది.