- పాత ఫొటోలు చూసుకుంటే..కొత్త ఉత్సాహం
- బెస్ట్ ఫొటోగ్రాఫర్లకు అవార్డుల ప్రదానం
హైదరాబాద్, వెలుగు: గత స్మృతులు, చరిత్రను తెలియజేసే పాత ఫొటోలు చూస్తుంటే మనసు తేలికై సరికొత్త ఉత్సాహం వస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలైన ఫొటోగ్రాఫర్లకు అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో గురువారం జరిగింది. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతికపరంగా గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ ఫొటోలకు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదన్నారు. జర్నలిస్టులతో సమానంగా ప్రెస్ ఫొటోగ్రాఫర్లు క్షేత్ర స్థాయిలో ఉత్సాహంగా ఫొటోలను బంధిస్తారని, వారికి మరింత గుర్తింపు రావాలన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. వెయ్యి పదాలను ఒక్క ఫొటో తెలియజేస్తుందన్నారు. ఇప్పటికీ ఎన్నో ఫొటోలు మన మదిలో ఉంటాయని, దీనికి ఉదాహరణగా ఆఫ్రికాలో ఆకలితో అలమటించే ఒక బాలికను ఒక రాబందు ఎత్తుకెళ్లేందుకు ఎదురుచూసే ఫొటోను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూర్మాచలం అనిల్ హాజరయ్యారు.
వెలుగు ఫొటో జర్నలిస్ట్లకు అవార్డులు
ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో ‘వెలుగు’ ఫొటో జర్నలిస్టులకు 10 అవార్డులు వచ్చాయి. బెస్ట్ న్యూస్ పిక్చర్కు గాను ‘వెలుగు’ ఫొటోగ్రాఫర్ నరేశ్ వరికిల్లకు ఫస్ట్ ఫ్రైజ్, స్కై లైన్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ వచ్చింది. కన్సోలేషన్ ప్రైజ్, బంగారు తెలంగాణ కేటగిరీలో కన్సోలేషన్తో కలిపి మొత్తం 5 అవార్డులు దక్కాయి. అలాగే వెలుగు సిద్దిపేట ఫొటోగ్రాఫర్ మహిమల భాస్కర్ను అర్బన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెకండ్ ప్రైజ్, కన్సోలేషన్ కింద మరో రెండు కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేశారు. బంగారు తెలంగాణ కేటగిరీలో శివకుమార్కు థర్డ్ ప్రైజ్, బెస్ట్ న్యూస్ పిక్చర్లో సురేశ్గౌడ్ కన్సో లేషన్ ప్రైజ్లు అందుకున్నారు.
