
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు వర్క్ను తమన్ స్టార్ట్ చేశాడు. పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు.
ఇప్పుడు ఈ సోదరులు అఖండ 2తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించారు. తమన్ అందిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వీరు సంస్కృత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారని మేకర్స్ తెలియజేశారు. ఈ శ్లోకాలు, వేద మంత్రాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా ఉంటాయన్నారు.
ఈ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హై వోల్టేజ్ ఎనర్జీని అందించబోతోందని అన్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5న వరల్డ్వైడ్గా సినిమా విడుదల కానుంది.