తండేల్ ప్రయాణం మొదలైంది

తండేల్ ప్రయాణం మొదలైంది

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్‌‌’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌‌ను దర్శకుడికి అందజేశారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ‘ఒకటిన్నర ఏడాదిగా ఈ కథతో ట్రావెల్ అవుతున్నా. ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నాం. ఇది చాలా ప్రత్యేకమైన చిత్రమని, కావాల్సిన సమయం తీసుకుని, పక్కాగా ప్లాన్ చేసి స్టార్ట్ చేద్దామని అరవింద్ గారు ప్రోత్సహించారు.

చందూ నాకు మంచి ఫ్రెండ్ కూడా. మేమిద్దరం కలసి చేస్తున్న మూడో సినిమా ఇది. ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉన్న సాయి పల్లవి ఇందులో నటిస్తుండడం హ్యాపీ. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ‘చక్కని విజన్‌‌ ఉన్న దర్శకనిర్మాతలతో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. ఆ విజన్‌‌ ప్రేక్షకులందరికీ సరిగ్గా చేరుతుందని ఆశిస్తున్నా’ అని సాయిపల్లవి చెప్పింది. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘నిజంగా జరిగిన కథ ఇది. ఈ కథని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళి చూపించాలి. దాన్ని క్రియేట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.

ఇటీవల సినిమాని పెద్దగా చూడటం అలవాటైంది. అలా పెద్దగా తీసి, రిలీజ్ చేయాలి. అందుకు తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్, డీవోపీ షామ్‌‌దత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర లాంటి అద్భుతమైన టీమ్‌‌తో నిర్మించడం ఆనందంగా ఉంది’ అన్నారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ‘టీమ్ అంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కలసి నా బెస్ట్ ఇస్తాను’ అన్నాడు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ  

‘గీతాఆర్ట్స్‌‌ సంస్థకు ఇది చాలా  ప్రత్యేకమైన స్క్రిప్ట్. టీమ్ అందరూ ఎంతో రీసెర్చ్‌‌ చేసి, ఎఫర్ట్‌‌ పెట్టారు. ఒక నటుడు ఒక పాత్రని బలంగా నమ్మి చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ ఫస్ట్ లుక్ చూశాక అర్థమైంది. నాగచైతన్య గారి హార్డ్ వర్క్‌‌కి హ్యాట్సాఫ్. రెండేళ్ళ క్రితం సాయి పల్లవి గారికి కథ చెప్పాం. వారి ఇన్‌‌పుట్స్‌‌ కూడా చాలా హెల్ప్ అయ్యాయి’ అని చెప్పారు.