![సీతారామ ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే లక్ష్యం : తుమ్మల](https://static.v6velugu.com/uploads/2024/05/17_Ugr3XpF0mE.jpg)
- అది త్వరలోనే నెరవేరబోతోంది
తల్లాడ, వెలుగు : సీతారామ ప్రాజెక్ట్ను పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించడమే తన జీవిత లక్ష్యమని, ఆ కల త్వరలోనే నెరవేరబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఏన్కూరు మండలంలోని సీతారామ లింక్ కెనాల్ పనులను బుధవారం పరిశీలించి, పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సమీపంలో టన్నెల్ పూర్తై, పాలేరు రిజర్వాయర్లోకి కలిపితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పారు.
గోదావరి జలాలు వాడుకున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్టే అవుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి అవుతుందని, ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. మెయిన్ కెనాల్ పనులు, నాలుగు పంప్ హౌజ్లతో పాటు దాదాపు అన్ని పనులు పూర్తి అయ్యాయని, పంపు హౌజ్ల ద్వారా లింక్ కాల్వలను సాగర్ కెనాల్లో కలిపి నీరు అందించడమే ఫస్ట్ ప్రపోజల్ అని చెప్పారు.
ఏన్కూరు లింక్ పూర్తయితే వైరా ప్రాజెక్ట్ కింద ఈ ఏడాదే భూములు సాగులోకి వస్తాయన్నారు. సాగర్ జలాలు రాకపోయినా వైరా, మధిర నియోజకవర్గాలతో పాటు, సత్తుపల్లి లంకా సాగర్ ప్రాజెక్ట్కు నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు గుత్తా వెంటేశ్వరరావు, మండల అధ్యక్షుడు స్వర్ణ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.