నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్
దుబాయ్: ఫుల్ ఫిట్నెస్ సాధించిన పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ నేతృత్వంలోని ఇండియా మంగళవారం మొదలయ్యే బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్స్కు సిద్ధమైంది. గ్రూప్–బిలో బరిలో ఉన్న ఇండియా తొలి రోజు కజకిస్తాన్తో మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. గాయం వల్ల గతేడాది ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ఈ టోర్నీతో తిరిగి గాడిలో పడాలని చూస్తోంది.
విమెన్స్ సింగిల్స్లో ఆమెకు బ్యాకప్గా 32వ ర్యాంకర్ ఆకర్షి కశ్యప్ మంచి ఫామ్లో ఉంది. మెన్స్ సింగిల్స్లో 8వ ర్యాంకర్ ప్రణయ్, పదో ర్యాంకర్ లక్ష్యసేన్ టీమ్ విజయానికి కీలకం కానున్నారు. గాయం వల్ల సాత్విక్ సాయిరాజ్ తప్పుకోవడంతో మెన్స్ డబుల్స్ బలహీనమైంది. ధ్రువ్ కపిలతో చిరాగ్ షెట్టి జోడీ కడుతున్నాడు. తెలుగు షట్లర్లు కృష్ణప్రసాద్, విష్ణువర్దన్ మరో జోడీగా ఉన్నారు. విమెన్స్ డబుల్స్లో యంగ్ స్టర్స్ ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని భట్, శిఖా గౌతమ్ బరిలో ఉండగా.. మిక్స్డ్లో ఇషాన్, తనీషా క్రాస్టో ఏకైక జంటగా అందుబాటులో ఉన్నారు. బుధవారం జరిగే రెండో మ్యాచ్లో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్స్ మలేసియా నుంచి ఇండియాకు ముప్పు ఉంది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్–బి టాప్ ప్లేస్ తేలనుంది. గురువారం యూఏఈతో ఇండియా తలపడనుంది. గ్రూప్లో టాప్2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకుంటాయి.