గౌహతి : ఏ రాష్ర్టంలోనైనా, ఏ దేశంలోనైనా పోలీసులు, భద్రతా సిబ్బందికి ఫిట్ నెస్ చాలా అవసరం. వారు ఫీట్ గా ఉంటేనే శాంతిభద్రతలతో పాటు ప్రజలకు రక్షణగా ఉంటారు. క్రైమ్ కేసులను త్వరగా చేధించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పోలీసు బలగాలను మరింత ఫిట్గా మార్చేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలల్లోగా ఐపీఎస్లతో సహా పోలీసులందరూ తమ శరీరాన్ని ఫిట్గా మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు వారి బీఎంఐ (BMI)ని లెక్కగట్టనుంది.
డైలీ ఎక్సర్ సైజులో బరువు తగ్గనివారికి.. మరో మూడు నెలలు అవకాశమిచ్చి, అప్పటికీ ఫలితం లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) కింద వారిని ఇంటికి పంపిస్తామని అస్సాం ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే విషయంపై అస్సాం డీజీపీ జీపీ సింగ్ ఒక ట్వీట్ చేశారు.
‘‘ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఐపీఎస్, ఏపీఎస్ (అస్సాం పోలీస్ సర్వీస్) అధికారులతో సహా అన్ని విభాగాలకు చెందిన పోలీసుల బాడీ మాస్ ఇండెక్స్ (BMI) నమోదు చేయాలని నిర్ణయించాం. ఆగస్టు 15 వరకు అందరికి మూడు నెలల సమయం ఇచ్చి.. ఆ తర్వాత బీఎంఐ లెక్కింపు చేపడతాం. ఊబకాయం (BMI 30+) కేటగిరీలో ఉన్న వారందరికీ బరువు తగ్గించుకునేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తాం. అప్పటికీ ఫిట్గా మారకపోతే.. థైరాయిడ్ సమస్య వంటి సమస్యలు ఉన్నవారు మినహా మిగతా వారికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆప్షన్ ఇస్తాం. అస్సాం డీజీపీనే ఆగస్టు 16న మొదటగా బీఎంఐ లెక్కింపునకు హాజరవుతారు’’ అని పేర్కొన్నారు.
అస్సాంలో దాదాపు 70 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. విధులకు పనికిరాని సిబ్బందిని ఇంటికి పంపేందుకు పోలీసు విభాగం కార్యాచరణ ప్రారంభించింది. మద్యానికి బానిసలుగా మారిన, ఊబకాయంతో బాధపడుతున్న, విధులకు అనర్హులుగా తేలిన 680 మందికిపైగా సిబ్బందితో కూడిన ఓ జాబితాను ఇప్పటికే రూపొందించింది. పూర్తి స్థాయి సమీక్ష అనంతరం వారికి వీఆర్ఎస్ ఆప్షన్ ఇస్తామని అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులందరిని ఫిట్గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. అస్సాం ప్రభుత్వ నిర్ణయంతో లావుగా ఉన్న పోలీసులు ఇప్పుడు తమ ఫిట్ నెస్ పై సీరియస్ గా దృష్టిపెట్టేందుకు రెడీ అవుతున్నారు.