
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న నృసింహ(బస్వాపురం) రిజర్వాయర్ నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. చిన్న వానకే రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతోంది. ఈ కోతలు బయటకు కన్పించకుండా ఉండేందుకు కాంట్రాక్టర్లు హడావుడిగా మట్టి నింపేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లాలోని బస్వాపూర్లో రిజర్వాయర్(16వ ప్యాకేజీ) నిర్మించాలని సర్కారు తలపెట్టింది. 11.39 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని ఆలేరు, ఆత్మకూర్(ఎం), భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేటమండలాల్లో 1,88,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. రెండేళ్లలో రిజర్వాయర్ను పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ నాలుగేండ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రమైన భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈపాటి వర్షానికే రిజర్వాయర్వెలుపలి వైపు కట్ట కోతకు గురైంది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన బస్వాపురం గ్రామానికి చెందిన కొందరు కట్ట కోతకు గురవడం గమనించి ఫొటోలు తీశారు. విషయం తెలిసి రిజర్వాయర్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కోతకు గురైన చోట హడావుడిగా మట్టిని నింపే పనులు చేపట్టారు.