
- ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్ట్లో గందరగోళం.. మళ్లీ వడపోతకు నిర్ణయం
- కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితారిలీజ్ చేయాలని సీఎం రేవంత్ అదేశం
- ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు
- స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకున్నది. తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కినట్టు తేలింది. దీంతో మళ్లీ అర్హులను సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లను వడపోయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ స్కీమ్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మొదలెట్టాలని సర్కారు అనుకుంది. దీంతో అర్హత లేకున్నా అప్లై చేసుకున్న వాళ్లంతా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లిస్ట్లో పేరు నమోదు చేసుకున్నారు. తీరా శాంక్షన్ లెటర్లు తయారు చేసే టైంలో లబ్ధిదారుల జాబితా చూసిన ఎమ్మెల్యేలు, అధికారులు అవాక్కయ్యారు. మధ్య, పేద తరగతి యువత కాకుండా ఇప్పటికే పెద్ద బిజినెస్లు చేసుకునేటోళ్లు, ప్రైవేట్లోనూ రూ. లక్షల జీతాలు తీసుకుంటున్నోళ్లు కూడా లబ్ధిదారుల లిస్ట్లోకి వచ్చారు. 45 ఏండ్లు పైబడినోళ్లు.. కొన్నిచోట్ల 60 ఏండ్ల వయస్సున్నోళ్లు కూడా ఈ స్కీమ్కు అప్లై చేసుకున్నట్టు గుర్తించారు. పైగా బడా లీడర్లు కూడా స్కీమ్ కోసం అర్హుల జాబితాలోకి రావడంతో ఇన్చార్జి మంత్రులు సైతం అవాక్కయినట్టు తెలుస్తున్నది. ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఆదివారం మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనూ రాజీవ్ యువ వికాసం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
ఒక్క ఇంటి నుంచే 2, 3 అప్లికేషన్లు
రాజీవ్ యువ వికాసం పథకానికి మొత్తం 16.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఆరేండ్లుగా సబ్సీడీ స్కీమ్స్ లేకపోవడంతో యువత పెద్ద సంఖ్యలో అప్లై చేశారు. అయితే, ఇందులో ఒక్కో కుటుంబం నుంచే 2, 3 అప్లికేషన్లు కూడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో అర్హత లేని వారి నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి. ఎమ్మెల్యేల చుట్టూ ఉండే కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల్లో కొందరు అర్హత లేకున్నా అప్లై చేసుకున్నారు. స్కీమ్కు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ కాగానే అందరూ ఎమ్మెల్యేల చుట్టూ చేరి.. వారిపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లిస్ట్లో నమోదు చేయించుకున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వాలని కొందరు మండలస్థాయి లీడర్లు ఎమ్మెల్యేలను కోరారు. ఇంకా గ్రామాల నుంచి అర్హులు వచ్చి లబ్ధిదారుల లిస్ట్లో చేర్చాలని కోరుతుండటంతో ఎక్కడో తప్పు జరుగుతుందని గ్రహించిన ఎమ్మెల్యేలు, అధికారులు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసినోళ్లకు రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధి చేకూర్చాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే, కచ్చితంగా వారికి అర్హత ఉండాలని, అనర్హులైతే కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే ఇవ్వొద్దని స్పష్టం చేశారు. పైగా ఎక్కువ సంఖ్యలో రూ. 4 లక్షల యూనిట్లకు అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కో యూనిట్కు 70 శాతం సబ్సిడీ వస్తుందనే ఆశతో దరఖాస్తు చేశారు. దీంతో రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షల యూనిట్లకు అప్లికేషన్లు తగ్గాయి. లక్ష రూపాయల యూనిట్లోకి మార్చుకోవాలని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు సూచించినా.. ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ నిధులు అవసరం పడుతున్నాయి.
స్కీమ్ అనుకున్నది ఇలా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది యువతకు వ్యాపారాలు పెట్టుకునేందుకుగానూ పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 4.93 లక్షల మంది అర్హులకు ఇచ్చేందుకు రూ.6,250 కోట్ల నిధులు కేటాయించింది. మొదటి దశలో జూన్లో 85 వేల మందికి రూ.650 కోట్ల సబ్సిడీతో రుణాలు మంజూరు
చేస్తారు. రూ.50 వేల వరకు యూనిట్లకు 100%, రూ. లక్ష వరకు 90%, రూ.2 లక్షల వరకు 80%, రూ.4 లక్షల వరకు 70% సబ్సిడీ ఇస్తారు. జులైలో లక్ష మందికి రూ.850 కోట్లు, ఆగస్టులో లక్ష మందికి రూ.1,250 కోట్లు, సెప్టెంబర్లో లక్ష మందికి రూ.1,500 కోట్లు, అక్టోబర్లో లక్షా 8 వేల 234 మందికి రూ.1,600 కోట్ల సబ్సిడీ అందజేస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించాలని ప్రభుత్వం షెడ్యూల్ కూడా ప్రకటించింది. మొదటి విడతలో జూన్ 2న రూ. లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడంతోపాటు జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రభుత్వంతో ఎంప్యానల్ చేసుకున్న సంస్థలతో ఎంట్రప్రెన్యూరియల్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల కంప్లీట్ చేసి.. గాంధీ జయంతి నాటికి అన్ని యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
అనర్హులకు సాయం అందొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
రాజీవ్ యువ వికాసానికి ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అలాగే, అనర్హులున్నట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని సీఎం దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరొద్దని అన్నారు. కాగా, ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నాక అర్హుల జాబితా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.