
న్యూఢిల్లీ: వరల్డ్ రిచెస్ట్మెన్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ యూ టర్న్ తీసుకున్నాడు. ఇండియాలో టెస్లా కార్ల తయారీ విషయంలో ఆయన మనసు మార్చుకున్నారు. భారత్లో టెస్లా కార్ల తయారీకి మస్క్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. సోమవారం (జూన్ 2) కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎలన్ మస్క్ నేతృత్వంలో టెస్లా కార్ల కంపెనీ ఇండియాలో కార్ల తయారీకి ఆసక్తి చూపించడం లేదని ఆయన తెలిపారు. కేవలం ఇండియాలో షోరూమ్లను తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలని మాత్రమే టెస్లా కోరుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. టెస్లా దేశంలో వాహనాలను తయారు చేసే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు.
భారతదేశం తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ విధానం కింద త్వరలో దరఖాస్తులను ఆహ్వానిస్తుందని తెలిపారు. యూరప్కు చెందిన మెర్సిడెస్ బెంజ్, స్కోడా, వోక్స్వ్యాగన్, దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్, కియా కంపెనీలు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల తయారికీ ఆసక్తి చూపాయని చెప్పారు. ఇండియాలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI) కోసం అప్లికేషన్ విండో త్వరలో ప్రారంభమవుతుందని.. అనంతరం ప్రభుత్వం అధికారిక దరఖాస్తులను స్వీకరిస్తుందని తెలిపారు.
కాగా, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. కాకపోతే భారతదేశం యొక్క అధిక దిగుమతి సుంకాలు దేశంలో టెస్లా విస్తరణకు అడ్డంకిగా మారాయి. అయితే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించింది. దీంతో టెస్లా ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంది. ఇందులో భాగంగా ఇండియాలో కార్ల మాన్యుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేందుకు కొంత స్థలాన్ని కూడా ఎంపిక చేసుకుంది.
చివర్లో ఏమైందో గానీ.. భారత్లో టెస్లా కార్ల తయారీకి మస్క్ ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇండియాలో టెస్లా కార్ల తయారీకి బ్రేక్ పడింది. మస్క్ నిర్ణయం వెనక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అమెరికా కంపెనీలను సొంతదేశంలోనే వ్యాపారం చేయాలని కోరాడు.
ALSO READ : Trump: ట్రంప్ డబుల్ టారిఫ్స్ బాంబ్.. ఆ భారతీయ స్టాక్స్ క్రాష్..
2025, ఫిబ్రవరిలోడొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. టెస్లా భారతదేశంలో ఫ్యాక్టరీని తెరవడానికి ఏవైనా ప్రణాళికలు ఉంటే అది చాలా అన్యాయం అని ఒపెన్గా చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్కు అత్యంత దగ్గరి వ్యక్తి అయిన మస్క్.. ఇండియాలో టెస్లా కార్ల తయారీ విషయంలో వెనకడుగు వేసినట్లు టాక్. భారత్లో ఐఫోన్లు ఉత్పత్తి చేస్తోన్న ఆపిల్ కంపెనీకి కూడా ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ చేసి అమెరికాలో ఫోన్లు విక్రయిస్తే భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు.