
దేశంలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ యాక్టివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. కేరళలో అత్యధికంగా 1336 యాక్టివ కేసులున్నాయి. దీంతోపాటు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, యూపీలో కరోనా కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఢిల్లీ, కేరళ, కర్ణాటక, యూపీలలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
భారత్ లో కొత్త సబ్ వేరియంట్ NB.1.8.1 ను WHO గుర్తించింది.ఈ వేరియంట్ ను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. వైరస్ లక్షణాలు, పాత వేరియంట్లతో పోలిస్తే ప్రభావంపై అధ్యయనం చేస్తున్నారు.నమూనాలను కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం INSACOG కి పంపించారు. గత రెండు వారాలుగా భారత్లో ఎక్కువగా BA.2, JN.1 వేరియంట్ కేసులు నమోదు అవుతున్నట్లు గుర్తించారు.
కరోనాకేసుల పెరుగుదలకు కారణాలివే..
ఏడాది క్రితం ఇచ్చిన వ్యాక్సిన్ల నిరోధక శక్తి తగ్గడం, ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించకపోవడం, వేగంగా విస్తరించే కొత్త వేరియంట్ NB.1.8.1 పుట్టుకురావడం వల్ల గత కొన్ని వారాలుగా దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని నిపుణులు, రిపోర్టులు చెబుతున్నాయి. వాతావరణంలో మార్పులు, గాలి నాణ్యతలో మార్పులు శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లను కూడా ప్రభావితం చేస్తాయి.
ప్రధాన నగరాల్లో కోవిడ్ కేసులు..
భారత్ లో కోవిడ్ యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి 3వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం కొత్త కేసులతో కలుపుకొని 3వేల368 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 68 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్యం 485కి చేరుకుంది.
మహానగరం ముంబైలో 30, పుణెలో 15, థానేలో 8, పింప్రి, చించ్వాడ్ లలోకొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. నవీ ముంబై, నాగ్పూర్, కళ్యాణ్, డోంబివాలి,రాయ్గఢ్లలో ఒక్కొక్కటి కొత్త కేసులు నమోదయ్యాయి.