
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్ను 74 రోజులు నిర్వహించాలన్న ప్లాన్స్ను బీసీసీఐ తాత్కాలికంగా పక్కనబెట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో 60 రోజులే నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతానికి ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు కాకపోయినా ఏప్రిల్ 1న మొదలుపెట్టి మే 31తో ముగించాలని యోచిస్తోంది. ఎందుకంటే జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫైనల్కు ఏడు రోజుల ముందు మరే టోర్నీలు ఆడేందుకు వీల్లేదు.
దీనికితోడు మార్చిలో విమెన్స్ ఐపీఎల్ కూడా ఉంటుంది కాబట్టి.. మెన్స్ టోర్నీని 60 రోజుల్లోనే ముగించాల్సి ఉంటుంది. ‘మొత్తం ఐపీఎల్ (విమెన్, మెన్) విండో మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉంది. దీనికితోడు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఉంది. కాబట్టి ఫైనల్ డేట్స్ను నిర్ణయించకపోయినా.. షెడ్యూల్ మాత్రం తక్కువగానే ఉండే చాన్స్ ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. లీగ్ ఎక్కువ రోజులు సాగితే ఫారిన్ ప్లేయర్లు అందుబాటులో ఉండటంపై కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.