ఓల్డ్​ సిటీలో బీజేపీ పాగా

ఓల్డ్​ సిటీలో బీజేపీ పాగా

హైదరాబాద్, వెలుగు :  ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఓల్డ్​సిటీలో బీజేపీ పాగా వేసింది.   మూడు డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ 10 డివిజన్లకు విస్తరించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి టెంపుల్, ఓల్డ్​ సిటీపై సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యాల ఏరివేత ప్రధాన అస్త్రాలుగా బీజేపీ ప్రచారం చేసింది. వరద సాయాన్ని ఆపాలని ఈసీకి బీజేపీ లెటర్ రాసినట్టు సీఎం కేసీఆర్​చేసిన ఆరోపణలను ఖండించిన బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్​.. ఈ లేఖ విషయంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట ప్రమాణం చేయాలని ఆయనకు సవాల్​విసరడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.  ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్​షా.. ఇదే  టెంపుల్​లో పూజలు చేయడం, ఓల్డ్ సిటీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రచారం కలిసొచ్చింది.

ఎంఐఎం సిట్టింగ్ స్థానంలో..

టీఆర్ఎస్​ సిట్టింగ్​ స్థానాలైన ఏడు డివిజన్లను,  ఎంఐఎం గెలిచిన ఒక డివిజన్​ను బీజేపీ గెలిచింది. ఐఎస్​సదన్​నుంచి జె.శ్వేత, గుడి మల్కాపూర్​ డివిజన్​నుంచి దేవర కరుణాకర్, గోషామహల్​నుంచి లాల్ సింగ్, చంపాపేట నుంచి   మధుసూదన్​రెడ్డి, జియాగూడ నుంచి  దర్శన్, మంగళ్​హట్​నుంచి  శశికళ, సైదాబాద్​నుంచి  అరుణ టీఆర్ఎస్ సిట్టింగ్​స్థానాల్లో గెలిచారు. జాంబాగ్  ఎంఐఎం సిట్టింగ్ ​స్థానం కాగా.. ఇక్కడ  బీజేపీ అభ్యర్థి రాకేశ్​ జైస్వాల్ గెలిచారు.   సిట్టింగ్ స్థానాలైన  బేగం బజార్ నుంచి శంకర్​యాదవ్, గౌలిపుర నుంచి భాగ్యలక్ష్మి గెలుపొందారు.  ఘాన్సీ బజార్​  లో మాత్రం  ఎంఐఎం గెలిచింది.