
జైపూర్: గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈసారి అద్భుతంగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్ 11 ఏండ్ల తర్వాత ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా క్వాలిఫయర్– 1కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పంజాబ్ టాప్- ప్లేస్ ఖాయమైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
రికీ తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్లే గ్రౌండ్లో స్వేచ్ఛగా రాణించగలిగానని అయ్యర్ పేర్కొన్నాడు. ‘రికీతో నాకు గత కొన్ని సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది. తను నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. గ్రౌండ్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతిస్తాడు. ఈ విషయాలన్నీ కలిసి మా టీమ్కు గొప్ప విజయాన్ని అందించాయి. జట్టులోని ప్రతి ఒక్కరూ సరైన సమయంలో రాణించారు. తొలి మ్యాచ్ నుంచి ఎలాంటి పరిస్థితి ఉన్నా అందరం గెలవాలనే తపనతోనే ఉన్నాం.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆటగాళ్లు బాధ్యత తీసుకున్నారు. ఈ విషయంలో కోచింగ్, సపోర్ట్ స్టాఫ్కు థ్యాంక్స్. ప్లేయర్ల మేనేజ్మెంట్ విషయంలో రికీ అద్భుతం. నాకు కూడా అందరిపై నమ్మకం కలగడం ముఖ్యం. లీగ్ ఆరంభంలోనే వచ్చిన విజయాలతో అది సాధ్యమైంది. జట్టులోని ప్రతి ఒక్కరితో నేను నిరంతరం మాట్లాడుతుంటాను. వారితో సత్సంబంధాలను కొనసాగించడం ముఖ్యం. మా డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం కూడా అద్భుతంగా ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం సులభం. కానీ మా జట్టులో అలాంటిది లేదు’ అని మ్యాచ్ అనంతరం అయ్యర్ పేర్కొన్నాడు. ముంబైపై అద్భుతంగా ఆడిన ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ను అభినందించాడు.