కరోనాను విపత్తుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. శనివారం కేంద్ర హోం శాఖ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. వైరస్తో చనిపోయిన వాళ్ల కుటుంబానికి, అది సోకిన వాళ్లకు పరిహారం అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ (ఎస్డీఆర్ఎఫ్) నిధులను అందుకోసం వాడుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా వైరస్తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించొచ్చని సూచించింది. కరోనాతో హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులకూ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు భరించాలని సూచించింది. క్వారెంటైన్లో ఉంటున్న వాళ్లకు తాత్కాలిక వసతి, తిండి, నీళ్లు, బట్టలు, మందుల వంటి సౌకర్యాలను కల్పించాలని చెప్పింది. అదనపు టెస్టింగ్ సెంటర్లు, పోలీసులకు ప్రొటెక్టివ్ పరికరాలు, ఆరోగ్య, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, థెర్మల్ స్కానర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరికరాల కోసం ఎస్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోవచ్చని చెప్పింది. అయితే, ఆ నిధులన్నింటినీ కేవలం రాష్ట్రాల వాటా నుంచే తీసుకోవాలని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి తీసుకోవద్దని చెప్పింది. కేటాయింపుల్లో పరికరాల ఖర్చు పది శాతానికి మించొద్దని ఆదేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జనాలు ఎక్కువగా రాకుండా మార్చి 16న ఆరు బెంచ్లు 12 చొప్పున అర్జెంట్ కేసులు మాత్రమే విచారించాలని సుప్రీం కోర్టు సూచించింది. భీమా కొరెగావ్ కేసులో గౌతమ్ నవలఖ, ఆనంద్ తేల్టుంబ్డే ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు, నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ పిటిషన్లను బెంచ్లు విచారించనున్నాయి.
స్టూడెంట్లూ..ఎక్కడికీ వెళ్లొద్దు
అమెరికాలో ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్లెవరూ బయటకు వెళ్లొద్దని అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు సూచించారు. అనవసరపు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. అమెరికాలోగానీ, ఇంటర్నేషనల్ ప్రయాణాలుగానీ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పారు. అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో మార్చి 16 నుంచి ఇండియాలోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్లలో అన్ని వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది అమెరికా. ఇప్పటికే అపాయింట్మెంట్లు తీసుకున్నోళ్లు రీషెడ్యూల్ చేసుకోవాలని చెప్పింది.
ఇంకొకరు మృతి?
మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో చనిపోయాడు. బుల్ధానా జిల్లా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడు. ఇటీవలే అతడు సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చాడని అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైబీపీతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడు చేరాడని, కరోనా లక్షణాలుండడంతో శనివారం ఉదయం జిల్లా ఆస్పత్రికి పంపించారని, ఐసోలేషన్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ చేశామని ఆస్పత్రి సివిల్ సర్జన్ ప్రేమ్చంద్ పండిట్ చెప్పారు. సాయంత్రం 4.20 గంటలకు చనిపోయాడని, శాంపిళ్లను టెస్టుల కోసం పంపామని చెప్పారు. దేశంలో కేసుల సంఖ్య 84కు పెరిగింది. కరోనాతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఏడుగురు వ్యక్తులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, వాళ్లలో కరోనా తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మొత్తం కేసుల్లో 17 మంది విదేశీయులేనని చెప్పింది. అందులో 16 మంది ఇటలీ వాళ్లు కాగా, ఒకరు కెనడాకు చెందిన వ్యక్తి అని పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వాళ్లను కలిసిన 4 వేల మందిని క్వారెంటైన్లో పెట్టామని తెలిపింది. ఇరాన్లో చిక్కుకున్న వారిని మహాన్ ఎయిర్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. శనివారం అర్ధరాత్రి ఆ విమానం ముంబైలో ల్యాండ్ అయింది. ఇటలీలోని మిలాన్లో చిక్కుకున్న ఇండియన్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఎయిరిండియా విమానాన్నీ పంపామని చెప్పింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమ్యూనిటీ సర్వైలెన్స్, క్వారెంటైన్, ఐసోలేషన్ వార్డులు, సిబ్బంది, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఇప్పటికే సిద్ధం చేశామని పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వాళ్లను కలిసిన వ్యక్తులు క్వారెంటైన్లో ఉండేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని చెప్పింది. ఇటలీలో చిక్కుకున్న 21 మంది కేరళకు తిరిగొచ్చారు. వాళ్లను అళువాలోని హాస్పిటల్లో ఐసోలేషన్లో పెట్టారు.
పారిపోయిన్రు..మళ్లీ వచ్చిన్రు
కరోనా అనుమానితులు నలుగురు ఆస్పత్రి నుంచి పారిపోయారు. లక్షణాలు ఎక్కువవుతుండడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చి చేరారు. శుక్రవారం ముగ్గురు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు నాగ్పూర్లోని ఇందిరా గాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీజీఎంసీహెచ్)కు వచ్చారు. అందులో ఓ వ్యక్తికి నెగెటివ్ వచ్చింది. మిగతా నలుగురి శాంపిళ్లను టెస్టులకు పంపించారు. అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఐసోలేషన్ వార్డులో ఉండాలని సిబ్బంది చెప్పారు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం నాటికి వాళ్లలో లక్షణాలు ముదురుతుండడంతో మధ్యాహ్నం టైంలో వాళ్లంతట వాళ్లే వచ్చి ఆస్పత్రిలో చేరారు. జ్వరం లక్షణాలుండి కొచ్చి మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన ఇద్దరు అమెరికా దంపతులు పారిపోయారు. కొచ్చి ఎయిర్పోర్టులో వాళ్లను పట్టుకుని కళామసేరీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. మార్చి 9న ఆ ఇద్దరు లండన్ నుంచి వయా దోహా ఇండియాకు వచ్చారు. కొచ్చిలో కథకళి షోను చూసి, అళప్పుజలోని ఫోర్ట్ కొచ్చి రిసార్ట్లో బస చేశారు. ఇప్పుడు క్వారెంటైన్కు పోయారు. కరోనా బాధితులను ట్రీట్ చేయనని అన్నందుకు జమ్మూకాశ్మీర్ డాక్టర్ సలీమ్ భట్టిని సస్పెండ్ చేశారు.
పారిపోయిన టెకీ భార్యకూ పాజిటివ్
బెంగళూరులోని గూగుల్ ఎంప్లాయికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇటలీలో హనీమూన్కు వెళ్లారు ఆ దంపతులు. తిరిగి రాగానే భర్తకు కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే ఇద్దరినీ బెంగళూరులో క్వారెంటైన్ చేశారు. కానీ, అతడి భార్య (25) ఈ నెల 8న క్వారెంటైన్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. విమానంలో న్యూఢిల్లీకి వెళ్లింది. అక్కడి నుంచి రైల్లో ఆగ్రాలోని తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. అంతేకాదు, ఆ టైంలో ఇంట్లో మొత్తం 8 మంది ఉన్నారు. మెడికల్ టీం వెళ్లి రిక్వెస్ట్ చేసినప్పుడు రైల్వే ఇంజనీర్ అయిన ఆమె తండ్రి క్వారెంటైన్కు వెళ్లలేదని, తన బిడ్డ బెంగళూరుకు వెళ్లిందంటూ అబద్ధం చెప్పాడని ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముకేశ్ కుమార్ వత్స్ చెప్పారు. జిల్లా కలెక్టర్, పోలీసుల సాయంతో మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లి అందరినీ క్వారెంటైన్కు పంపించామన్నారు. ఆమెకూ కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
మరో 4 ఐటీబీపీ క్వారెంటైన్లు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో నాలుగు క్వారెంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో ఆ క్వారెంటైన్ సెంటర్లను పెట్టనుంది. మొత్తంగా 1,300 మందిని వాటిలో క్వారెంటైన్ చేసేలా వసతులు కల్పిస్తున్నారు. తమిళనాడులోని శివగంగైలో 300, చండీగఢ్లో 580, అరుణాచల్ ప్రదేశ్లోని కిమిన్లో 210, ఎంపీ కరేరాలో 180 మందిని క్వారెంటైన్ చేస్తారు.
పద్మ అవార్డుల వేడుక వాయిదా
పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 26న వేడుక జరగాల్సి ఉండగా, దానిని ఏప్రిల్ 13కి పోస్ట్పోన్ చేసింది. ఈ మేరకు శనివారం కేంద్ర హోం శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఏడుగురికి పద్మ విభూషణ్, 16 పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది.