నాలుగేండ్లలో రాష్ట్ర అప్పులు డబుల్

నాలుగేండ్లలో రాష్ట్ర అప్పులు డబుల్

95% పెరిగాయని ప్రకటించిన కేంద్రం
2018 మార్చినాటికి 1,60,296 కోట్లు
2022 మార్చి నాటికి రూ. 3,12,191 కోట్లు
గత రెండేండ్లలోనే కొత్తగా దాదాపు రూ. 87 వేల కోట్ల అప్పులు
అప్పుల పెరుగుదలలో దేశంలోనే 6 వ స్థానం
15వ ప్లేస్​లో ఏపీ.. లాస్ట్​లో గుజరాత్

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ ప్రభుత్వ అప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018 మార్చి నుంచి 2022 మార్చి వరకు అంటే గడిచిన నాలుగేండ్లలో డబుల్​ అయ్యాయని లోక్​సభలో ప్రకటించింది. 2018 తో పోలిస్తే 2022 నాటికి దాదాపు 95 శాతం అప్పులు పెరిగాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి రూ. 1,60,296.3 కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పు, ఈ యేడాది మార్చి నాటికి రూ. 3,12,191.3 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.  ప్రతి ఆర్థిక సంవత్సరంలో అప్పులు పెరిగిపోతున్నాయి. 2018 మార్చి నుంచి 2019 మార్చి నాటికి తెలంగాణ సర్కార్ రూ. 29,906.4 కోట్ల అప్పు చేసింది. 2019–2020 మధ్య రూ. 35, 215.3 కోట్లు అప్పలు చేసింది.  2020–21 లో రూ. 42, 112.7 కోట్లు,  2021–2022లో ఏకంగా రూ. 44,660.6 కోట్లు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే గడిచిన రెండేండ్లలోనే  రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త అప్పులు దాదాపు రూ. 87 వేల కోట్లని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, మలోత్ కవిత, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ‘‘స్టేట్ ఫైనాన్స్‌‌‌‌లు: 2021-22 బడ్జెట్ల స్టడీ’’ పేరుతో తయారు చేసిన రిపోర్ట్ లోని అంశాలను ప్రస్తావించారు. 

ఆరో స్థానంలో తెలంగాణ.. 15వ స్థానంలో ఏపీ 

తెలంగాణ అప్పులు 2018 లో రూ. 1,60,296.3 కోట్లు, 2019 లో రూ. 1,90,202.7 కోట్లు, 2020 లో రూ. 2,25,418 కోట్లు, 2021 లో రూ. 2,67,530.7 కోట్లుగా ఉంది. 2022 మార్చి నాటికి ఈ అప్పు రూ. 3,12,191.3 కోట్లకు చేరాయి. అలాగే, 2021–2022 (బడ్జెట్ ఎస్టిమేట్) నాటికి 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో తెలంగాణ ఆరో స్థానంలో,  ఆంధ్రప్రదేశ్​ 10.7 శాతంతో 15 ప్లేస్ లో ఉన్నట్లు రిపోర్ట్​లోని అంకెలు చెప్తున్నాయి. మధ్య ప్రదేశ్ 19 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా... 18.8 శాతంతో హర్యానా సెకండ్ ప్లేస్, 18.7 శాతంతో అస్సాం థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. 18 శాతంతో తమిళనాడు, సిక్కిం నాలుగో స్థానంలో ఉన్నాయి. జీరో పాయిట్ వన్  శాతం (16.8 శాతం) తో రాజస్థాన్ తెలంగాణ కన్నా ముందుంది.  రాష్ట్రాల అప్పుల పెరుగుదల శాతంలో కేవలం 6.4 శాతంతో గుజరాత్  చివరి స్థానంలో ఉంది.

జీఎస్డీపీలోనూ భారీగా అప్పులు

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లోనూ గత మూడేండ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం ప్రకటించింది.  2016లో తెలంగాణ జీఎస్డీపీలో అప్పుల శాతం 15.7% ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల ఉన్నట్లు రిపోర్టులో వెల్లడైంది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పుల నమోదు కనిపించింది.