సుడాన్ నుంచి యుద్ధనౌక‌లో బ‌య‌లుదేరిన 278 మంది భార‌తీయులు

సుడాన్ నుంచి యుద్ధనౌక‌లో బ‌య‌లుదేరిన 278 మంది భార‌తీయులు

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సూడాన్‌ ఓడరేవుకు దాదాపు 500 మంది వరకు భారతీయులు చేరుకున్నారు. ఇంకా మరికొంతమంది అక్కడకు చేరుకుంటున్నారు. నౌకలు, విమానాలను అక్కడకు ఇప్పటికే పంపించింది భారత ప్రభుత్వం. సూడన్ లో ఉన్న భారతీయులకు అన్నివిధాలా సాయపడేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.

తొలివిడతగా 278 మంది భారతీయులను యుద్ధనౌక ద్వారా సూడాన్‌ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. అక్కడి నుంచి విమాన మార్గంలో స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సూడాన్‌లోని సాయుధ వర్గాలు 72 గంటల కాల్పుల విరమణకు అంగీకరించడం కూడా ఆపరేషన్‌ కావేరి చేపట్టేందుకు సుగమమైంది.

నేవీ షిప్ ఐఎన్ఎస్ సుమేదాలో తొలి బ్యాచ్‌ బ‌య‌లుదేరింది. ఆ యుద్ధనౌక సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి త‌న ట్విట్టర్‌లో తెలిపారు. ఆప‌రేష‌న్ కావేరీలో భాగంగా ఈ త‌ర‌లింపు ప్రక్రియ కొన‌సాగుతోంది. విదేశాంగ శాఖ ప్రతినిధి అరింద‌మ్ బాగ్చి త‌న ట్విట్టర్‌లో ఐఎన్ఎస్ సుమేదా ఫోటోల‌ను పోస్టు చేశారు. పోస్టు సుడాన్ నుంచి జెడ్డాకు సుమారు 278 మంది యుద్ధ నౌక సుమేదాలో వ‌స్తున్నట్లు బాగ్చి తెలిపారు. 


సుడాన్‌లో తీవ్ర సంక్షోభం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అక్కడ ఆర్మీ, పారామిలిట‌రీ ద‌ళాల మ‌ధ్య భీక‌ర పోరు కొనసాగుతోంది.  భార‌తీయుల త‌ర‌లింపు కోసం జెడ్డాలో ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా రంగంలో ఉంచారు. జెడ్డా చేరుకున్న త‌ర్వాత భార‌తీయుల్ని స్వదేశానికి తీసుకురానున్నారు.

సూడాన్‌ నుంచి ప్రజల తరలింపులో భాగంగా 28 దేశాలకు చెందిన 388 మందిని ఆదివారం (ఏప్రిల్ 23న) రాత్రి తమ దేశానికి తీసుకువెళ్లినట్లు ఫ్రాన్స్‌ తెలిపింది. వీరిలో ఐదుగురు భారతీయులు సైతం ఉన్నారు. స్నేహపూర్వక దేశాలకు చెందిన 66 మందిని తమ దేశానికి తీసుకువెళ్లినట్లు సౌదీ అరేబియా సైతం తెలిపింది. వీరిలో ముగ్గురు భారతీయ విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్‌ కావేరి పర్యవేక్షణ బాధ్యతలను విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌కు అప్పగించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

సూడాన్‌ నుంచి తమ ప్రజల్ని, దౌత్యవేత్తల్ని తీసుకువెళ్లేందుకు ప్రపంచదేశాల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. వీరంతా వెళ్లిపోతే దేశంపై ఆధిపత్యం కోసం పోరు మరింత తీవ్రతరం అవుతుందని సూడాన్‌వాసులు భయపడుతున్నారు. తమ పౌరులను తరలించేందుకు ఫ్రాన్స్‌, జోర్డాన్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, గ్రీస్‌, జపాన్‌, బ్రిటన్‌ వంటి దేశాలకు చెందిన విమానాలు సూడాన్‌కు పెద్దఎత్తున చేరుకుంటున్నాయి.