రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరైన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు

రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరైన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు

రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్,తమిళి సై సౌందర రాజన్ హాజరయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో  భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపదీ ముర్ము చేత ప్రమాణం చేయించారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన తొలి గిరిజన నాయకురాలిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రెండో  మహిళగా నిలిచారు.అంతేకాదు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు మహిళగా కూడా రికార్డుల్లోకి చేరారు.

అంతకు ముందు ఇవాళ ఉదయం ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు. రాజఘాట్ నుంచి తన తాత్కాలిక నివాసానికి తిరిగి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆమెకు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ భవనంకు వచ్చిన ద్రౌపది ముర్ము ను ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా లు పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు తీసుకుని వెళ్లారు.