- పార్టీ ఫిరాయించబోమని అఫిడవిట్లు
- గెలిచాక టీఆర్ఎస్ గుంజుకుంటుందని ముందు జాగ్రత్త
- ఆశావహుల నుంచి అప్లికేషన్లతో పాటు బ్లాంక్ చెక్కులు
- కొన్ని జిల్లాల్లో రూ.5లక్షల వరకు ఫిక్సుడ్ డిపాజిట్లు
- సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 300 మంది నుంచి ప్రామిసరీ నోట్లు
- అసెంబ్లీ, పంచాయతీ ఎలక్షన్ల నాటి ఫిరాయింపుల ఎఫెక్ట్
(వెలుగు, నెట్వర్క్)
కాంగ్రెస్ పార్టీకి జంపింగ్ల భయం పట్టుకుంది. గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో, ఏడాది కిందటి అసెంబ్లీ ఎలక్షన్లు, తర్వాత జరిగిన పరిషత్ ఎలక్షన్లలో తమ పార్టీ తరఫున గెలిచిన చాలామంది అధికార పార్టీలోకి దూకడంతో ఈసారి అలర్టయింది. తాజా మున్సిపల్ ఎలక్షన్లలో టికెట్ల కోసం వస్తున్న ఆశావహుల నుంచి అప్లికేషన్లతోపాటు అఫిడవిట్లు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు ఏది వీలైతే అది తీసుకోవాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో టికెట్ల కోసం ఇప్పటివరకు కాంగ్రెస్ ఆఫీసుకు సుమారు మూడు వేల అప్లికేషన్లురాగా.. అందులో 300 మంది అఫిడవిట్లు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొన్నిచోట్ల రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే టికెట్ ఇస్తామని అక్కడి కాంగ్రెస్ లీడర్లు చెప్తుండటం హాట్టాపిక్గా మారింది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది ఔట్..
2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ 19 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎంపీగా గెలిచిన ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూర్నగర్సీటును టీఆర్ఎస్ గెలుచుకోవడంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఆరుగురే (జగ్గారెడ్డి– సంగారెడ్డి-, -కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి–-మునుగోడు,- మల్లు భట్టివిక్రమార్క–-మధిర-, సీతక్క–ములుగు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు–మంథని, పొదెం వీరయ్య–భద్రాచలం) కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ఆ పార్టీకి ఇదే అత్యంత ఘోరమైన పరిస్థితి. ఇక లోక్సభ ఎలక్షన్లలో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ లీడర్ సైతం గెలిస్తే పార్టీ మారబోనని ప్రామిస్ చేస్తూ, అఫిడవిట్ సమర్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఐదేండ్లుగా ఇదే పరిస్థితి
ఐదేండ్ల కింద 2014లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ల నుంచి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ను ముమ్మరం చేస్తూ వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తనవైపు తిప్పుకోవడం ద్వారా మ్యాజిక్ ఫిగర్ సాధించి.. వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. ఉదాహరణకు అప్పటి మహబూబ్నగర్ జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉండగా.. టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కూటమి తలా ఒక్క చోటే మెజారిటీ సాధించాయి. కాంగ్రెస్ 6 చోట్ల మెజారిటీ సాధించింది. కానీ ఆ పార్టీలోని కీలకమైన వ్యక్తులకు చైర్మన్ పదవులు ఆశచూపిన టీఆర్ఎస్.. ఏకంగా 5 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేసింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, కల్వకుర్తి, షాద్నగర్ మున్సిపాలిటీలు ఈ రకంగానే అధికార పార్టీ ఖాతాలో పడ్డాయి. ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ గెలుచుకున్న ఇల్లెందు మున్సిపాలిటీని తర్వాత టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. మధిర, కొత్తగూడెంలో మెజారిటీ వార్డులను కాంగ్రెస్ గెలుచుకున్నా టీఆర్ఎస్ పాగా వేసింది. నల్గొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. గతేడాది జరిగిన మండల పరిషత్ ఎలక్షన్లలో కాంగ్రెస్ నుంచి గెలిచి, అధికార పార్టీలో చేరిన ఎంపీటీసీ సభ్యులు వందల్లో ఉంటారు.
అఫిడవిట్లతో రండి
కాంగ్రెస్ లీడర్లు గతేడాది జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికలప్పుడు కొన్నిజిల్లాల్లో ఆశావహుల నుంచి అఫిడవిట్లు తీసుకున్నారు. నామినేషన్ల గడువు ముగిసే సమయంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంతో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ అప్పటి ఎన్నికల్లో గెలిచిన కొందరు పదవులు, పైసల ఆశతో టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ముందే అఫిడవిట్లు తీసుకోవాలని నిర్ణయించారు. పలు జిల్లాల్లో దీనికి స్పందన బాగానే వస్తోందని లీడర్లు చెప్తున్నారు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో162 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ తరఫున పోటీకి 3 వేల అప్లికేషన్లు వచ్చాయి. కానీ టికెట్ఆశించేవారంతా అప్లికేషన్లతో పాటు అఫిడవిట్లు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కుల్లో ఏదైనా ఇవ్వాలని తేల్చిచెప్పడంతో ఒక్కొక్కరే సమర్పిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో ఆశావహుల నుంచి అఫిడవిట్లు తీసుకున్నాకే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ స్పష్టం చేయడం విశేషం.
5 లక్షలు డిపాజిట్ చేయాలె..
కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ లీడర్లు మరో అడుగు ముందుకేసి.. మీడియేటర్ల దగ్గర డిపాజిట్లు చేయించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దగ్గరకు కొందరు వెళ్లి టికెట్లు అడిగారు. రూ.5 లక్షలు ముందస్తు డిపాజిట్ చేస్తేనే టికెట్ చేతిలో పెడతామని, చైర్మన్ ఎన్నిక పూర్తయ్యాక వెనక్కిస్తామని ఆయన చెప్పడంతో తెల్లమొహాలేశారు.
అఫిడవిట్లు తీసుకుంటం..
గత అనుభవాల దృష్ట్యా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పార్టీ బీఫామ్ ఇచ్చే సమయంలో అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలని భావిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మా జిల్లాలోనైతే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. – పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు