
- న్యాయ వ్యవస్థను బానిసగా మార్చుకోవాలనుకున్నరు
- ప్రజలు శక్తిమంతులు కావడంతో మంచి రోజులు వచ్చాయి
- ట్రకోమా రహిత దేశంగా ఇండియా
- ఆరోగ్య కార్యకర్తలు, జల్ జీవన్ మిషన్తోనే ఇది సాధ్యమైంది
- యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్లు.. రాజ్యాంగాన్ని హత్య చేయడంతో పాటు.. న్యాయ వ్యవస్థను బానిసగా మార్చుకోవాలనుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నాడు జార్జ్ ఫెర్నాండెజ్ను సంకెళ్లతో బంధించారని తెలిపారు. కానీ, దేశ ప్రజలు శక్తిమంతమైన వాళ్లు కావడంతో.. ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు. ఎమర్జెన్సీ విధించినవాళ్లు ఓడిపోయారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండానే.. మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీపై పోరాడినోళ్లను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోరార్జీ దేశాయ్ ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్ను వినిపించారు. 123వ మన్కీ బాత్ ఎపిసోడ్ లో భాగంగా మోదీ మాట్లాడారు. ‘‘1975 నుంచి 1977 మధ్య 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారికి నివాళి అర్పిస్తున్నాను. మొరార్జీ దేశాయ్, బాబు జగ్జీవన్ రామ్, అటల్ బిహారీ వాజపేయి వంటి నేతలను స్మరించుకోవాలి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన స్టూడెంట్ల గొంతు నొక్కేశారు. దేశ ప్రజలంతా తిరగబడటంతో ఎమర్జెన్సీ ఎత్తేశారు’’అని మోదీ అన్నారు.
95 కోట్ల మందికి ప్రభుత్వ పథకాలు
ఇండియాను ట్రకోమా (కంటి వ్యాధి) నుంచి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమని తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్, ‘జల్ జీవన్’ మిషన్ దీనికి దోహదపడ్డాయన్నారు. ‘‘95 కోట్ల మంది కేంద్ర పథకాలతో లబ్ధిపొందుతున్నారు. 2015 వరకు ఈ సంఖ్య కేవలం 25 కోట్లు మాత్రమే. దేశంలోని 64% ప్రజలు సోషల్ ప్రొటెక్షన్ బెనిఫిట్స్ పొందుతున్నట్లు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) రిపోర్ట్ ఇచ్చింది.
జూన్ 21న జరిగిన యోగా డే కార్యక్రమాల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. పదేండ్ల కింద మొదలైన ఈ కార్యక్రమం ఏటేటా విస్తరిస్తోంది. చాలామంది ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు” అని మోదీ అన్నారు. కైలాశ్, మానస సరోవర్ యాత్ర చాలాకాలం తర్వాత తిరిగి ప్రారంభమైందని, జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం అవుతుందని తెలిపారు. నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు జరిగే పవిత్ర యాత్రలు దేశ ఐక్యతను ప్రతిబింబిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్ర ఘనంగా జరిగిందన్నారు.
బోడోల్యాండ్ యువత.. అందరికీ ఆదర్శం
మేఘాలయకు చెందిన ఎరి సిల్క్.. ఇటీవలే జీఐ ట్యాగ్ను పొందిందని, ఎరి సిల్క్ను ‘అహింసా సిల్క్’ అని కూడా పిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఎప్పుడూ అల్లర్లు, హింసతో అట్టుడికిన బోడోల్యాండ్.. ఇప్పుడు శాంతిని పంచుతున్నది. ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా మారింది. వారికి ఉన్న పరిమిత వనరులతోనే ప్రాక్టీస్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. దేశంలోని చిన్నారులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. బోడోల్యాండ్ సీఈఎం కప్ టోర్నీలో 3,700 కంటే ఎక్కువ జట్లు, 70వేల మంది ప్లేయర్లు పాల్గొన్నారు.
ఫిట్నెస్, అధిక బరువు తగ్గించుకోవడానికి ఫుడ్లో ఆయిల్ వినియోగాన్ని 10% తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. విశాఖపట్నంలో నిర్వహించిన యోగా డే అద్భుతం. ఆర్కే బీచ్లో 3లక్షల మంది ఒకేసారి యోగా చేసి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. స్టూడెంట్లు 108 నిమిషాల్లో.. 108 సూర్య నమస్కారాలు చేశారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ తదితర ప్రాంతాల్లోనూ యోగా డే వేడుకలు నిర్వహించారు’’అని మోదీ తెలిపారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉన్న శుభాంశు శుక్లాకు అభినందనలు చెప్పారు.