- రాష్ట్రపతి, గవర్నర్లకు లెటర్లు రాసిన కాంట్రాక్ట్ టీచర్లు
భద్రాచలం, వెలుగు: హైకోర్టు చెప్పినా తమను విధుల్లోకి తీసుకోవట్లేదని, ఆత్మహత్య చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ.. భద్రాద్రికొత్తగూడెంకు చెందిన కొంతమంది ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాంట్రాక్ట్ టీచర్లు సోమవారం రాష్ట్రపతి, గవర్నర్కు లెటర్లు రాశారు.14 ఏండ్ల పాటు చాలీచాలని జీతాలతో భద్రాచలం ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) పరిధిలోని స్కూళ్లలో పనిచేసిన 11 మంది టీచర్లను 2018–-19లో అప్పటి ఐటీడీఏ పీఓ తొలగించారని అందులో పేర్కొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, లీడర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
గత్యంతరం లేక 2018లో హైకోర్టును ఆశ్రయించగా 2020లో సింగిల్ బెంచ్జడ్జిమెంట్లో ఆశ్రమ స్కూల్స్ లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ఇంప్లిమెంట్ చేయకుండా కమిషనర్ అప్పీలుకు వెళ్లగా, హైకోర్టు 2021 డిసెంబరులో కాంట్రాక్టు పద్ధతిలో 11మందిని తిరిగి నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. నాలుగు నెలలు కావస్తున్నా తమను విధుల్లోకి తీసుకోకుండా ఐటీడీఏ వేధిస్తోందని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిమెంట్నైనా అమలు చేయండి, లేకుంటే చనిపోవడానికి అనుమతి ఇవ్వండంటూ లెటర్లో విజ్ఞప్తి చేశారు.