మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రీజియన్ పరిధిలో దాదాపు 8 వేల మంది పారిశుద్ధ్య, స్కావెంజర్, తోటమాలి, హౌజ్కీపింగ్, బెల్ట్క్లీనింగ్, సెక్యూరిటీ, సివిల్, అటెండర్లు, నీటి సరఫరా తదితర కార్మికులు విధులకు హాజరుకావడంలేదు. శానిటేషన్కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో కార్మికవాడల్లో టన్నుల కొద్దీ చెత్తపేరుకుపోతోంది. బెల్లంపల్లి రీజియన్లోని మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, నస్పూర్, బెల్లంపల్లి, గోలేటి, సోమగూడెం, భారత్, కార్మిక వాడలు కంపుకొడుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్లు స్తంభించి కుండీల నుంచి మురికినీరు, వ్యర్థాలు రోడ్డుపైకి వచ్చి చేరుతున్నాయి. చెత్త కుప్పల వద్ద పందులు, దోమల బెడద ఎక్కువైంది. గనుల వద్ద బెల్ట్ క్లీనింగ్, షెల్ పిక్కింగ్ పనులు లేక బొగ్గు రవాణా ఇబ్బంది మారింది. సీహెచ్పీలు, ఓసీపీల వద్ద మట్టి, రాళ్లు తొలగించే వారు లేక కోల్క్వాలిటీ దెబ్బతింటోంది.
30 వేల మంది కాంట్రాక్ట్కార్మికులు..
సింగరేణిలో 42 వేల మంది పర్మినెంటు ఎంప్లాయీస్ ఉండగా...సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. నేరుగా బొగ్గు ఉత్పత్తిలో వీరి సేవలు లేకున్నా... ఇతర పనుల్లో సంస్థ పర్మినెంటు ఎంప్లాయీస్తో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. అయినా సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్ల నుంచి సరైన గుర్తింపు లేదు. కోలిండియాలో హైపవర్ కమిటీ సూచించిన వేతనాలు ఇస్తున్నా.. సింగరేణిలో మాత్రం అది అమలు కావడంలేదు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఆచరణలోకి రాలేదు. బోనస్, సీఎంపీఎఫ్, వైద్య , ఇతర సౌలత్లను కల్పించడంలేదు.
24 విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు...
సింగరేణిలో ప్రస్తుతం 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. సివిల్, సివిక్, సులభ్, సెక్యూరిటీ, ఓసీపీ ఓబీ, వర్క్షాప్, స్టోర్స్, బెల్ట్ క్లీనింగ్, సర్ఫేస్, గెస్ట్హౌజ్లు, ఫారెస్ట్, నర్సరీలు, క్యాంటీన్లు, కోల్ ట్రాన్స్ పోర్టులో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. అండర్ గ్రౌండ్ మైన్లలో మేషన్, రూప్ సపోర్టింగ్, లైన్మెన్, రైల్వే ట్రాక్, లోడింగ్, అన్ లోడింగ్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టబ్ క్లీనింగ్, జనరల్ మజ్దూర్, షేల్పీకింగ్, వేబ్రిడ్జి తదితర 24 విభాగాల్లో పనిచేస్తున్నారు.
ఉధృతమవుతున్న ఆందోళన...
కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుండడంతో బొగ్గు ఉత్పత్తేర పనులు నిలిచిపోయాయి. ఈనెల 16న డిమాండ్లపై హైదరాబాద్లో డిప్యూటీ లేబర్ కమిషనర్సమక్షంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆందోళన ఉధృతం చేశారు.
- కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
- జీవో 60 ప్రకారం జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
మంచిర్యాల, వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మెయిన్ గేటు ఎదుట బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేశారు. ఈ సందర్భంగా జేఏసీ లీడర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతో సింగరేణి ఏటా వందల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నా.. జీతాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచిందని.. ఇది అన్ని విభాగాల్లో అమలవుతున్నా.. సింగరేణిలో మాత్రం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు సింగరేణిలో అమలుకు నోచుకోవడంలేదన్నారు. ధర్నాలో ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఎస్సీకేఎస్లీడర్లు ముస్కే సమ్మయ్య, డి.బ్రహ్మానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.