ఈత కొట్టుకుంటూ వెళ్లి తీసుకొచ్చిన నేరేడుచర్ల ఎస్సై
నేరేడుచర్ల, వెలుగు : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో మూసీ నదిలో గల్లంతైన బాలిక డెడ్బాడీ ఆదివారం దొరికింది. మండలంలోని సోమవరం గ్రామానికి చెందిన కొమ్మరాజు సుస్మిత (13) తాను తయారు చేసిన మట్టి గణపతిని నిమజ్జనం చేసేందుకు శనివారం ఫ్రెండ్స్తో కలిసి సోమప్ప ఆలయం వెనుక భాగంలోని మూసీ నదికి వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతైంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్స్, రెవెన్యూ ఆఫీసర్లు శనివారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నదికి అవతలి వైపు బాలిక డెడ్బాడీ కొట్టుకురావడాన్ని గుర్తించారు. కానీ నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో డెడ్బాడీని తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో నేరేడుచర్ల ఎస్సై రవీందర్ స్వయంగా నీటిలోకి దిగి ఈత కొట్టుకుంటూ వెళ్లి తాడు అందించారు. ఆ తాడు సాయంతో బాలిక డెడ్బాడీని బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎస్సైని గ్రామస్తులు అభినందించారు.
