ఇక నుంచి భూముల లెక్కలు ఏఈవోలకు

ఇక నుంచి భూముల లెక్కలు ఏఈవోలకు
  • రేషన్​కార్డు, ఇండ్ల పట్టాలపంపిణీ పంచాయతీ సెక్రటరీకి
  • ఆర్​ఆర్​ యాక్టు, ఎన్నికల నిర్వహణ విధులు కూడా..
  • చెరువులు, కుంటల సంరక్షణ డ్యూటీ ఇరిగేషన్ ​ఏఈలకు
  • రెవెన్యూ శాఖ నుంచి పలు బాధ్యతలు బదిలీ
  • కొత్త రెవెన్యూ చట్టం కోసం ప్రతిపాదనలు రెడీ

హైదరాబాద్, వెలుగు: ఇప్పటివరకు రెవెన్యూ శాఖ చేతిలో ఉన్న భూముల రికార్డుల నిర్వహణ బాధ్యత ఇక నుంచి వ్యవసాయ శాఖ పరిధిలోకి మారనుంది. ఊళ్లలోని భూముల రికార్డులను భద్రపరచడం, పంటల సాగు వివరాలు రికార్డు చేయడం వంటి విలేజ్​ రెవెన్యూ ఆఫీసర్​ (వీఆర్వో) పనులు అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్​ (ఏఈవో)కు దక్కనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం రెవెన్యూ పర్యవేక్షణలో ఉన్న ఆసరా పెన్షన్ల మంజూరు, రేషన్​కార్డుల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ పంచాయతీ సెక్రటరీకి దక్కనుంది. కొత్త రెవెన్యూ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రెడీ చేసింది. వీఆర్వో వద్ద ఉండే బాధ్యతలు, తీసేసే బాధ్యతలను స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యవస్థకు అవినీతి మకిలీ అంటించిన బాధ్యతలన్నీ ఈ శాఖ నుంచి పూర్తిగా బదిలీ చేసేలా కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి. తుది పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వీటిని చట్టంలో పొందుపరచనుంది.
రెవెన్యూ నుంచి ఇతర డిపార్ట్​మెంట్లకు బదిలీ చేసేవి..

  • ఊరికి సంబంధించిన అన్ని రికార్డులను, అకౌంట్లను ఏఈవోకు అప్పగించడం. పంటల అజమాయిషీ, భూముల రికార్డులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విధులు కూడా ఏఈవోకే బదిలీ.
  • ప్రభుత్వ శాఖల ఆస్తులను ఆయా శాఖలకు అప్పగించడం. ఆయా శాఖల భూముల ఆక్రమణలకు సంబంధిత ఆఫీసర్లదే బాధ్యత. అలాగే ప్రభుత్వ శాఖల ఆస్తుల ధ్వంసమైనా ఇదే పద్ధతి ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూముల ఆక్రమణ విషయంలో సంబంధిత శాఖలు, తహశీల్దార్​తో ఫాలో అప్ ​చేసి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
  • విలేజ్​ సర్వెంట్ల పే బిల్లుల తయారీ బాధ్యతలను మండల స్థాయి ఆఫీసర్​కు అప్పగించడం.
  • చెరువులు, కుంటల సంరక్షణ బాధ్యతలను సాగునీటి శాఖ ఏఈకి బదిలీ చేయడం.
  • గ్రామ పంచాయతీ పరిధిలోని ఆసరా పెన్షన్ల మంజూరు, రేషన్​కార్డుల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ వంటి రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న విధులను పంచాయతీ కార్యదర్శికి అప్పగించడం.
  • గ్రామ పంచాయతీ పరిధిలోని బర్త్​, డెత్​ రిజిస్ర్టర్ నిర్వహణ పంచాయతీ కార్యదర్శి పరిధిలో ఉంచడం. కనీస వేతనాల చట్టం అమలు బాధ్యతలను పంచాయతీ కార్యదర్శికి బదిలీ చేయడం. గ్రామ చావడీ నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శిపైనే ఉంటుంది.
    వీఆర్వోల నుంచి పూర్తిగా తొలగించేవి…
  • భూమి శిస్తు, సెస్సు, పన్నుల వసూలు, ఇతర ప్రభుత్వ శాఖలకు వచ్చే రెవెన్యూ వసూలు అధికారాలు.
  • వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో జరిగే రైలు ప్రమాదాల సమాచారాన్ని ఆ శాఖకు.. విమాన ప్రమాదాల విషయాన్ని సమీపంలోని పోలీసు స్టేషన్లకు అధికారికంగా సమాచారం ఇచ్చే విధులు.
  • కరెంట్​ సరఫరాకు సంబంధించి అనధికారిక వాడకం, సరఫరాలో నష్టం వంటి విషయాలను సంబంధిత శాఖకు సమాచారం ఇచ్చే బాధ్యతలు.
  • పైఆఫీసర్​ ఎవరైనా బదిలీ, సస్సెన్షన్, రిమూవల్, డిస్మిస్​, రిటైర్మెంట్ అయిన​ సందర్భాల్లో వీఆర్వోకు ఆ బాధ్యతలను అప్పగించడం ఉండదు.
  • పోలీసు స్టేషన్​తో కో ఆర్డినేషన్​ చేసే అన్ని రకాల బాధ్యతలు.
    పంచాయతీ సెక్రటరీకి అప్పగించేవి…
  • క్యాస్ట్, ఇన్​కం, రెసిడెన్స్, సాల్వెన్సీ వంటి సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం.
  • అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాను, ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు పైఆఫీసర్లకు సమాచారం ఇచ్చే డ్యూటీ.
  • గుప్త నిధులు, ఎవరికీ చెందని ఆస్తులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు.. పురాతన వస్తువులు, వారసత్వ భవనాలను కూల్చడం వంటి సమాచారాన్ని
  • తహశీల్దార్​కు తెలిపే విధులు. ఈ అంశాలపై పంచనామా నిర్వహణ.
  • రెవెన్యూ రికవరీ యాక్టు అమలులో సంబంధిత అధికారులకు సాయంగా ఉండడం, లోన్ల రికవరీ డ్యూటీ.
  • రకరకాల కార్యక్రమాలపై ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు, ఇతర పబ్లిసీటీ కార్యక్రమాల నిర్వహణ.
  • ఎన్నికల ఓటర్ల జాబితా అప్​గ్రేడేషన్, ఇతర ఎన్నికల నిర్వహణ డ్యూటీ.

తెలంగాణలో కరోనా పాజిటివ్ రేటు దేశంలోనే హయ్యెస్ట్